- Home
- International
- పేరుకే పెద్దన్న, బుద్ధి మాత్రం.. హైదరాబాద్ చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదస్పద వ్యాఖ్యలు
పేరుకే పెద్దన్న, బుద్ధి మాత్రం.. హైదరాబాద్ చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదస్పద వ్యాఖ్యలు
Hyderabad: అమెరికాలో ఉపాధి ఆధారిత వీసా విధానాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. మిస్సౌరీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. చిలుకూరు బాలాజీ ఆలయంపై చర్చకు దారి తీశాయి.

వీసా వ్యవస్థపై తీవ్ర విమర్శలు
అమెరికా ఉద్యోగ మార్కెట్ను విదేశీ కార్మికులు ఆక్రమిస్తున్నారని ఎరిక్ ష్మిట్ ఆరోపించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, ఓపీటీ వంటి కార్యక్రమాలు అమెరికా మధ్యతరగతి ఉద్యోగుల అవకాశాలను తగ్గిస్తున్నాయని అన్నారు. ఈ విధానాల వల్ల అమెరికన్ ఉద్యోగులకు వేతన ఒత్తిడి పెరుగుతోందని, పెద్ద టెక్ కంపెనీలు తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని విమర్శించారు. అమెరికా ఫస్ట్ విధానాలను ముందుకు తీసుకెళ్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా ష్మిట్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విదేశీ కార్మికులపై ఆధారపడటం వల్ల అమెరికన్ యువత ఉద్యోగ పోటీలో వెనుకబడుతోందని పేర్కొన్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు
హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ష్మిట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఆలయాన్ని “వీసా టెంపుల్”గా పేర్కొంటూ, అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు అక్కడ ప్రార్థనలు చేస్తారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వీసాలు రావాలని ప్రార్థనలు చేసే భారతీయుల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ష్మిట్ “ఈ వీసా మాఫియాకు ఒక వీసాల ఆలయం ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టులో చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను కూడా షేర్ చేయడం మరింత చర్చకు దారితీసింది. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలను అవమానించేలా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.
American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026
భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ఆరోపణలు
విదేశీ విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నారని ష్మిట్ పేర్కొన్నారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బుతో విదేశీ విద్యార్థులకు రాయితీలు అందుతున్నాయని ఆరోపించారు. చదువు పూర్తయ్యాక వీరు హెచ్-1బీ వీసాలు, తరువాత గ్రీన్ కార్డులు పొందుతూ అమెరికా ఉద్యోగ మార్కెట్లో స్థిరపడుతున్నారని అన్నారు.
తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికా గ్రాడ్యుయేట్లు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యారుణాలతో బాధపడుతున్న స్థానిక యువతకు ఇది అన్యాయం అవుతోందని విమర్శించారు. అంతేకాకుండా, వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ వల్ల ప్రతిభ కంటే జాతి ఆధారిత ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.
చిలుకూరు ఆలయానికి ఎందుకు “వీసా టెంపుల్” పేరు వచ్చింది?
హైదరాబాద్కు సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి ఎన్నో ఏళ్లుగా “వీసా బాలాజీ”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. భక్తులు 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుతూ, వీసా వచ్చిన తర్వాత 108 ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. ఈ విశ్వాసం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
హెచ్-1బీ వీసాల్లో భారతీయుల ఆధిపత్యం
అమెరికా హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా చాలా ఎక్కువగా ఉంది. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగాల్లో భారతీయ నిపుణులకు అధిక డిమాండ్ ఉండటంతో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భారతీయులు ఈ వీసాలను పొందుతున్నారు. అమెరికా గణాంకాల ప్రకారం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అమెరికాకు వెళ్తున్నారు. చైనా తర్వాత అత్యధికంగా అమెరికా వర్క్ వీసాలు పొందుతున్న దేశం భారత్గానే కొనసాగుతోంది. ఇటీవల అమెరికాలో వలస విధానాలపై రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్న నేపథ్యంలో, ఎరిక్ ష్మిట్ వ్యాఖ్యలు మరోసారి హెచ్-1బీ వ్యవస్థపై అంతర్జాతీయ దృష్టిని తీసుకువచ్చాయి.

