ఈ దేశాల వారికి అమెరికాకు శాశ్వతంగా నో ఎంట్రీ.. ట్రంప్ కీలక ప్రకటన
Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు వచ్చే వలసవాదులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

శ్వేతసౌధం వద్ద కాల్పుల తరువాత కీలక ప్రకటన
అమెరికా రాజధానిలో శ్వేతసౌధానికి సమీపంలో జరిగిన కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో నేషనల్ గార్డ్ మహిళా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి గాయపడ్డాడు. నిందితుడు అఫ్గానిస్థాన్కు చెందిన రెహ్మనుల్లా లకన్వాల్గా గుర్తించారు. ఈ పరిణామం వెంటనే ట్రంప్ దృష్టికి వెళ్లడంతో వలసలపై కఠిన చర్యలు ప్రకటించారు.
పేద దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేత
తక్కువ ఆదాయం ఉన్న దేశాల (థర్డ్ వరల్డ్ కంట్రీలు) నుంచి అమెరికాకు వలసలు ఇక శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. దేశానికి పరిరక్షణ అవసరం అని, ఇలాంటి వలసలు భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ ప్రవేశాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితిలో ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని తెలిపారు.
అక్రమ ప్రవేశాల వారిపై చర్యలు
గత ప్రభుత్వంలో ఆటోపెన్ సంతకాలతో ప్రవేశ అనుమతులు పొందిన లక్షల మందిని రద్దు చేస్తామని ట్రంప్ తెలిపారు. దేశానికి విధేయత లేకుండా వచ్చినవారిని వెనక్కు పంపే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. అమెరికా ప్రయోజనాలు రక్షించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
వలసదారుల సంక్షేమ పథకాల నిలిపివేత
ట్రంప్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. అమెరికా పౌరులు కాని వారికి అందిస్తున్న ఫెడరల్ బెనిఫిట్స్, సబ్సిడీలు నిలిచిపోతాయని చెప్పారు. దేశాభివృద్ధికి తోడ్పడని వారిపై ఖర్చు చేయడం సరికాదని, భద్రతను కాపాడే విధానం ముందుంటుందని తెలిపారు.
సమీక్షకు 18 దేశాల గ్రీన్ కార్డ్ హోల్డర్లు
అఫ్గానిస్థాన్తో పాటు మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లను అధికారులు తిరిగి పరిశీలించనున్నారు. భద్రతా ప్రమాణాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో దక్షిణ సూడాన్, సోమాలియా, నైగర్, బుర్కినా ఫాసో, పాకిస్థాన్, ఉగాండా వంటి దేశాలు ఉంటాయి.

