ఎక్కడో ఇథియోపియాలో అగ్ని ప్రమాదం పేలితే.. భారత్లో ఎందుకు పొగ కమ్మేసింది
Ethiopia volcano: ఎథియోపియాలో అగ్ని పర్వతం పేలిన వార్త ప్రపంచాన్ని కుదిపేసింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్పై ఈ అగ్ని పర్వత పేలుడు ప్రభావం ఎందుకు పడింది.? అసలేం జరిగింది.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

12 వేల ఏళ్ల తర్వాత..
ఎథియోపియాలోని హైలి గుబ్బి (Hayli Gubbi) అనే అగ్ని పర్వతం సుమారు 12,000 సంవత్సరాల తరువాత మళ్లీ విస్పోటనం చెందింది. ఈ పేలుడు వల్ల ఏర్పడిన భారీ బూడిద మేఘాలు యెమెన్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశం వైపు చేరాయి. ఇది దేశంలో ఇప్పటికే ఉన్న వాయు కాలుష్య పరిస్థితులపై ప్రభావం చూపుతూ విమాన రాకపోకలను కూడా దెబ్బతీసింది.
ఎలాంటి ప్రాణ నష్టం లేదు..
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలోని హైలి గుబ్బి అగ్ని పర్వతం చాలా కాలం పాటు నిశ్శబ్దంగా ఉంది. కానీ తాజాగా అకస్మాత్తుగా పేలడంతో పెద్ద ఎత్తులో బూడిద, పొగ, గాజు కణాలు ఆకాశంలోకి చేరాయి. అయితే ఇంత భారీ వస్పోటనం జరిగినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ చుట్టుపక్కల గ్రామాలు బూడిదతో నిండిపోయాయి. దీంతో జంతువులకు ఆహారం దొరకక సమస్యలు ఎదురవుతున్నాయి.
బూడిద మేఘాలు భారత్ వైపు ప్రయాణం
వాతావరణ నిపుణుల ప్రకారం ఈ బూడిద మేఘం గంటకు 120–130 కిమీ వేగంతో కదిలింది. ఇది మొదటిగా భారతదేశంలో జైసల్మేర్ – జోధుపూర్ ప్రాంతంలోకి ప్రవేశించింది. తర్వాత గుజరాత్, రాజస్థాన్, హర్యాణా, దిల్లీ, పంజాబ్, ఉత్తర మహారాష్ట్ర, వైపు ప్రయాణించింది. అయితే ఈ బూడిద 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తు నుంచి ప్రయాణించడంతో భూమి మీదున్న ప్రజలకు పెద్ద ప్రమాదం లేకపోయినా ఆకాశం మసకగా, నీలం రంగు బదులు బూడిద గోధుమగా కనిపించింది.
విమాన రాకపోకలకు పెద్ద ఆటంకం
విమానాల ఇంజన్లలోకి అగ్ని పర్వత బూడిద పడితే ఇంజిన్ పాడవడం, హీట్ అవడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. అందుకే DGCA విమాన సంస్థలకు మార్గాలు మార్చాలని సూచించింది. ఇండిగో, ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా, కేఎల్ఎమ్ వంటి సంస్థలు అనేక విమాన సర్వీసులను రద్దు చేశాయి. ముఖ్యంగా అబుదాబి, దుబాయ్, జెడ్డా, కువైట్ మార్గంలో ప్రయాణించే భారత విమానాలకు ఎక్కువ ప్రభావం పడింది. కొన్ని విమానాలు గమ్యస్థానానికి వెళ్లకుండా ఇతర ఎయిర్పోర్టులలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
కాలుష్యంపై ప్రభావం
ప్రస్తుతం బూడిద మేఘం అత్యధిక ఎత్తులో ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యంపై పెద్ద ప్రభావం లేదని వాతావరణ విభాగం చెబుతోంది. దిల్లీ వాతావరణం మరింత మసకగా, చీకటిగా కనిపించింది. అలాగే సూర్యకిరణాలు అడ్డుకట్టబడటంతో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే దిల్లీ AQI 328గా ఉండగా, బూడిద కారణంగా విజుబిలిటీ తగ్గింది
ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.?
భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. అగ్ని పర్వతం పేలుడు నుంచి ఉద్భవించిన బూడిద భారతదేశాన్ని దాటేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ బూడిద చైనా వైపు కదులుతోంది. మంగళవారం (ఈరోజు) రాత్రి 7.30 వరకు భారత దేశ గగనతలం నుంచి మొత్తం బూడిద క్లియర్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా దీనివల్ల తాత్కాలిక ప్రభావమే ఉంటుందని, దీర్ఘకాలంగా పెద్దగా నష్టం ఉండదని చెబుతున్నారు.

