Sunday: ఆదివారం నాన్ వెజ్, ఆల్కహాల్ నిషేధిస్తూ తీర్మానం.. ఎక్కడ, ఎందుకో తెలుసా?
ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిది ముద్ద దిగని వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఇటీవల ఆదివారం నాన్ వెజ్ తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గ్రామంలో ఏకంగా నాన్వెజ్, మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు.

ఆదివారం మాంసం, మద్యం తినొద్దని గ్రామస్థులు తీర్మానం
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని గర్షకుర్తి గ్రామవాసులు ఆదివారాన్ని పవిత్ర దినంగా పాటించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ గ్రామంలో ప్రవచనాలు చేస్తూ వచ్చిన భూపతి శ్రీనివాస్ రామాయణం, మహాభారతం గురించి వివరించారు.
ఇందులో భాగంగా, ఆదివారం సూర్యుని దినంగా భావించి మాంసాహారం, మద్యం పూర్తిగా మానుకోవాలని ఆయన సూచించారు. దీనిని గ్రామస్తులు స్వాగతించి, ప్రతి ఆదివారం తమ ఇళ్లలో మాంసం వండకూడదని, మద్యం తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలోని కూడళ్లలో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ఆదివారం చరిత్ర ఏంటి.?
స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో గురుకుల విద్యా విధానం ప్రధానంగా ఉండేది. ఆ రోజుల్లో ఆదివారం ఒక ఆరాధనా దినంగా భావించేవారు. విద్యార్థులు గురువులను గౌరవిస్తూ, సూర్య భగవానునికి పూజలు చేసేవారు. అయితే బ్రిటిష్ పాలన వచ్చిన తరువాత భారతీయ సంప్రదాయాలను మారుస్తూ ఆదివారాన్ని సెలవు దినంగా మార్చేశారని చరిత్రకారులు చెబుతుంటారు.
మాంసాహార అలవాట్ల ద్వారా సంప్రదాయాలపై ప్రభావం
బ్రిటిష్ పాలకులు పాశ్చాత్య జీవనశైలిని ప్రోత్సహిస్తూ ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించారు. దీనితో పాటు మాంసాహారాన్ని, మద్యం సేవనాన్ని ప్రోత్సహించారు. దీని ప్రభావంగా భారతీయులు ఆదివారం మాంసం తినే అలవాట్లు అలవర్చుకున్నారు. ఇది భారతీయ సంస్కృతి మీద ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా కొన్ని మార్పులకు దారితీసింది.
ఆదివారం శుద్ధి, పూజలకు అంకితం చేయాలన్న నమ్మకం
హిందూ ధర్మశాస్త్రాల్లో ఆదివారం శరీర శుద్ధికి, మానసిక ప్రశాంతతకు ఎంతో ప్రాముఖ్యముంటుంది. ఈ రోజున మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాక, సూర్యుని శక్తి శరీరానికి సహజంగా లభించేది కాబట్టి, శుభ్రమైన ఆహారం తీసుకోవడం శ్రేయస్కరంగా పరిగణిస్తారు.
సంప్రదాయాలపై తిరిగి దృష్టి పెడుతున్న ప్రజలు
ఆధునిక కాలంలో మరుగున పడిన సంప్రదాయాలను కొన్ని గ్రామాలు మళ్లీ ఆచరణలోకి తీసుకొస్తున్నాయి. గర్షకుర్తి వంటి గ్రామాలు ఆదివారం మాంసం మానేసి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మికపరమైన మార్గాన్ని అవలంబిస్తున్నాయి. ఇది సమాజంలో కొత్త మార్పునకు సంకేతంగా భావించాలి.