Dry Fish vs Fresh Fish: ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే ఎండు చేపలు తినడం మంచిదా? పచ్చి చేపలు తినడం మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

ఎండుచేపలు, పచ్చిచేపల్లో ఏది బెస్ట్?
ఎండు చేపలు, పచ్చి చేపలు.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం తాజా చేపల్లో సహజమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాసెసింగ్ తక్కువగా ఉంటుంది. అంతేకాదు పచ్చి చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తాజా చేపలు తక్కువ ఉప్పు కలిగి ఉండటం వల్ల రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇవి మరింత సురక్షితమైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.
ఎండు చేపలు తింటే?
ఇక ఎండుచేప విషయానికి వస్తే, ఇవి కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. చేపలోని నీటిని పూర్తిగా తొలగించడం వల్ల అందులోని ప్రోటీన్, ఖనిజాలు మరింత సాంధ్రతతో ఉంటాయి. అంటే కొద్దిపాటి ఎండుచేపలు తిన్నా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఇందులో బాగా ఉంటాయి. అయితే చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల సోడియం స్థాయి అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
హానికరమైన రసాయనాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎండుచేపల్లో కొన్ని సందర్భాల్లో హానికరమైన రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్లు ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగించవచ్చు. అంతేకాకుండా సరైన పరిశుభ్రత లేకుండా తయారు చేసిన ఎండుచేపల్లో బ్యాక్టీరియా, పారాసైట్స్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు ఉండే ప్రమాదం ఉంది. ఇవి ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.
వీరు తినకపోవడం మంచిది
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండుచేపల్లో మెర్క్యురీ వంటి లోహాల స్థాయిలు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా పెద్ద చేపలను ఎండబెట్టినప్పుడు ఈ లోహాలు మరింత కేంద్రీకృతమవుతాయి. ఇవి గర్భిణీలు, పిల్లలకు ప్రమాదకరం. అలాగే ఎండబెట్టే ప్రక్రియలో నీటిలో కరికే విటమిన్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు అవసరం
పచ్చి చేపల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. తాజా చేపలు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. లేకపోతే వాటిపై బ్యాక్టీరియా చేరి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. సరైన విధంగా నిల్వ చేసి, తాజాగా వండుకొని తింటే తాజా చేపలు ఆరోగ్యానికి అత్యుత్తమమైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.
చేపలను రెగ్యులర్ గా తింటే?
ఆరోగ్య నిపుణుల ప్రకారం, రోజువారీ ఆహారంలో తాజా చేపలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలాగనీ ఎండుచేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎండుచేపలను తగ్గించడం మంచిది. ఎండుచేప వండేటప్పుడు ముందుగా నీటిలో నానబెట్టి ఉప్పును తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

