- Home
- Life
- Health
- ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త
ఏమిటీ 'క్యాచ్ దెమ్ యంగ్' స్ట్రాటజీ..? ఇది మీ పిల్లలను బానిసలుగా మార్చేస్తుంది.. జాగ్రత్త
ఒకప్పటి స్నాక్స్ ఆరోగ్యకరం, శక్తినిచ్చేవి. కానీ నేటి స్నాక్స్ అనారోగ్యకరం. మల్టీ బిలియన్ జంక్ ఫుడ్ ఇండస్ట్రీకి మన పిల్లల ఆరోగ్యం కంటే వారి వార్షిక లాభాలే ముఖ్యం.

బాల్య రుచులే జీవితాంతం ఇష్టమైన రుచులు..
“మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? ” అని ఎవరినైనా అడిగితే.. మనసు క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే ఒక జవాబు చెబుతుంది. ఆ జవాబు కేవలం ఒక రుచి మాత్రమే కాదు, అది మన బాల్యపు జ్ఞాపకాల లోతుల్లో నుంచి పెల్లుబికిన భావోద్వేగం. ఎందుకంటే బాల్యంలో అలవాటైన రుచే.. జీవితాంతం ఇష్టమైన రుచిగా మిగిలిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక శాస్త్రీయ సత్యం. మన *సబ్కాన్షియస్ మైండ్* (ఉపచేతన మనస్సు)లో చిన్నప్పుడు నాటుకున్న రుచులు మన ప్రవర్తనను శాసిస్తాయి. అందుకే “అలవాటు అనేది రెండో స్వభావం” అంటారు.
క్యాచ్ దెమ్ యంగ్ (Catch them young) అంటే ఏమిటి..?
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ మల్టీ-బిలియన్ డాలర్ జంక్ ఫుడ్ పరిశ్రమ మన పిల్లల మనస్తత్వాన్ని, వారి ఇష్టాఇష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. వాణిజ్య ప్రకటనల భాషలో దీనిని “క్యాచ్ దెమ్ యంగ్” స్ట్రాటజీ అంటారు. అంటే ఒక బిడ్డకు రుచి మొగ్గలు (Taste buds) వికసించే దశలోనే తమ ఉత్పత్తులను అలవాటు చేయడం. తద్వారా వారు జీవితాంతం తమ బ్రాండ్కు బానిసలుగా ఉండేలా చూసుకోవడం.
రంగుల వెనుక విషం..
పిల్లలు సహజంగానే ఆకర్షణీయమైన రంగులు, వింత ఆకృతులు, నోట్లో వేస్తే కరకరలాడే (Crunchy) పదార్థాల పట్ల మొగ్గు చూపుతారు. పరిశ్రమలు ఇదే సూత్రాన్ని వాడుకుంటున్నాయి.
ఆకర్షణీయమైన ప్యాకింగ్ : రంగురంగుల కవర్లు, కార్టూన్ బొమ్మలతో పిల్లలను బురిడీ కొట్టిస్తారు.
బ్లిస్ పాయింట్ (Bliss Point) : ఆహార శాస్త్రవేత్తలు చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో కలిపి ‘బ్లిస్ పాయింట్’ను సృష్టిస్తారు. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి, ఆ ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తినాలనే బలమైన కోరికను (Addiction) కలిగిస్తుంది.
అడిటివ్స్ ఆండ్ ప్రిజర్వేటివ్స్ : కేవలం రుచి కోసం వాడే ఎం.ఎస్.జి (MSG), అధిక మోతాదులో ఉండే సోడియం పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
సంప్రదాయం vs సౌకర్యం
ఒకప్పుడు మన స్నాక్స్ అంటే అమ్మమ్మ చేతి అరిసెలు, జంతికలు, తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు, వేరుశనగ ముద్దలు. అవి కేవలం ఆహారం మాత్రమే కాదు పోషకాల గనులు. కానీ నేడు మనం ‘సౌకర్యం’ (Convenience) పేరుతో సూపర్ మార్కెట్లలో లభించే ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లకు ఆకర్షితులై ప్యాకెట్లలోని విషాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ఫలితంగా నేటి తరం పిల్లలు అతి చిన్న వయసులోనే ఊబకాయం (Obesity), మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు.
మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది..!
ఈ మల్టీ-బిలియన్ జంక్ ఫుడ్ ఇండస్ట్రీకి మన పిల్లల ఆరోగ్యం కంటే వారి వార్షిక లాభాలే ముఖ్యం. మనం పిల్లలకు ఇస్తున్నది శక్తినిచ్చే ఆహారమా లేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అలవాటా? అని ఒక్కసారి ఆలోచించాలి.
మార్పు మనతోనే మొదలవ్వాలి : ఇంట్లో చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు, సజ్జలు) వాడకం పెంచాలి.
అవగాహన : ప్రకటనల మాయలో పడకుండా, ప్యాకెట్ వెనుక ఉండే ‘న్యూట్రిషన్ లేబుల్’ చదవడం అలవాటు చేసుకోవాలి.
సహజ ఆహారం : ప్రాసెస్ చేసిన ఆహారం కంటే ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
నేడు మనం మార్చుకునే ఒక చిన్న అలవాటు.. రేపటి తరం ఆరోగ్యానికి ఒక పెద్ద వరం అవుతుంది.
By
suneetha. Principal. Slate the school. Bowrampet

