Health tips: ఈ పండ్లు, కూరగాయలను ఇలా తింటే ప్రమాదం!
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ కొన్ని పండ్లు, కూరగాయలను సరిగ్గా తినకపోతే అవి విషంగా మారి, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అవి ఏంటో.. వాటిని ఎలా తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పచ్చి జీడిపప్పు
మనం కొనే జీడిపప్పు నిజానికి పచ్చివి కావు. విషపూరిత "యురుషియోల్" నూనెను తొలగించడానికి వాటిని ఆవిరిలో ఉడికిస్తారు. పచ్చి జీడిపప్పు తొక్కలో ఈ నూనె ఉండటం వల్ల చర్మ అలెర్జీ, ఇరిటేషన్ వంటి సమస్యలు వస్తాయి.
ఆపిల్ గింజలు
ఆపిల్ చాలా పోషకమైంది. కానీ దాని గింజల్లో "అమిగ్డాలిన్" అనే రసాయనం ఉంటుంది. ఇది జీర్ణమైనప్పుడు హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఎక్కువ ఆపిల్ గింజలు తింటే తలనొప్పి, మైకం, వాంతులు రావచ్చు. అనుకోకుండా కొన్ని గింజలు తింటే పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పండ్ల గింజలు
చెర్రీ, ప్లమ్స్, పీచ్, ఆప్రికాట్ వంటి కొన్ని పండ్ల గింజల్లో కూడా ఆపిల్ గింజల్లో లాగా అమిగ్డాలిన్ ఉంటుంది. ఈ గింజల్ని నమిలి తింటే లేదా నలిపితే హైడ్రోజన్ సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ పండ్ల గింజలు తినడం ప్రమాదకరం.
స్టార్ ఫ్రూట్
స్టార్ ఫ్రూట్ చూడటానికి అందంగా, రుచికరంగా ఉన్నా.. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం. దీంట్లో నాడీ వ్యవస్థను దెబ్బతీసే విషపదార్థం ఉంటుంది. ఆరోగ్యవంతులు తక్కువ మోతాదులో తింటే సురక్షితమే. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని తినకపోవడమే మంచిది. తింటే వణుకు, కన్ఫ్యూజన్, కోమా వంటివి రావచ్చు.
బంగాళదుంపలు
బంగాళదుంపలు సాధారణంగా సురక్షితమే అయినా, పచ్చి బంగాళదుంపలు, ముఖ్యంగా తొక్క పచ్చగా మారితే లేదా మొలకెత్తితే ప్రమాదకరం. వీటిలో "సోలనిన్", "చాకోనిన్" వంటి గ్లైకోఅల్కలాయిడ్లు ఉంటాయి. వీటిని తింటే కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. పచ్చగా మారిన లేదా మొలకెత్తిన భాగాలను తొలగించి, బంగాళదుంపలను బాగా ఉడికించి తినడం మంచిది.
పచ్చి రాజ్మా
పచ్చి లేదా సరిగ్గా ఉడకని రాజ్మాలో "ఫైటోహెమాగ్లుటినిన్" అనే విషపదార్థం ఉంటుంది. దీన్ని తింటే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి. రాజ్మాను బాగా ఉడికించడం ద్వారా ఈ విషపదార్థాన్ని నాశనం చేయవచ్చు.
అకీ పండు
పశ్చిమ ఇండీస్ దీవుల్లో ప్రసిద్ధి చెందిన అకీ పండు పూర్తిగా పక్వానికి రాకముందు తినడం చాలా ప్రమాదకరం. దీనిలో "హైపోగ్లైసిన్ ఎ", "హైపోగ్లైసిన్ బి" వంటి విష పదార్థాలు ఉంటాయి. పచ్చి అకీ తింటే వాంతులు, కడుపు నొప్పి, మైకం, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. పండినవి మాత్రమే సురక్షితం. అది కూడా గింజలు తీసేసి తినాలి.
లిచి పండు
లిచి పండు రుచికరమైంది అయినప్పటికీ, ముఖ్యంగా పచ్చి లిచి పండ్లు, వాటి గింజలు ప్రమాదకరం. వీటిలో "హైపోగ్లైసిన్ ఎ", "ఎంసిపిజి" వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి వణుకు, మెదడు దెబ్బతినడానికి దారితీస్తాయి. ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలు పచ్చి లిచి తినడం చాలా ప్రమాదకరం.
మరవల్లి
మరవల్లిలో "లినామారిన్", "లోటాస్ట్రాలిన్" వంటి సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో సైనైడ్గా మారతాయి. మరవల్లిని సరిగ్గా వండకుండా లేదా ప్రాసెస్ చేయకుండా తింటే విషప్రభావం కలగవచ్చు. తలనొప్పి, మైకం, వాంతులు, కడుపు నొప్పి రావచ్చు. నానబెట్టి తొక్క తీసి బాగా ఉడికించడం ద్వారా దాని విషప్రభావాన్ని తగ్గించవచ్చు.