Dosa Batter : రుబ్బిన దోశ పిండి ఎన్ని రోజులు వాడాలో తెలుసా?
Dosa Batter: సాధారణంగా దోశ పిండిని చాలా మంది ఎక్కువ రుబ్బుకొని ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. కానీ, ఈ పిండిని ఇంట్లో తయారు చేసే సమయంలో, స్టోర్ చేసే సమయంలో పొరపాట్లు చేస్తే.. ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా?

దోశ పిండి...
సౌత్ ఇండియన్స్ కి బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోశలు మాత్రమే. ఇంట్లో అయినా అవే చేసుకుంటారు.. బయటకు వెళ్లినా అవే తింటారు. అయితే… మనం ఇంట్లో ఇడ్లీ, దోశలు చేసుకోవాలంటే వాటికి పిండి తయారు చేసుకోవడం ముఖ్యం. చాలా మంది.. వారానికి సరిపడా పిండి రుబ్బుకొని.. ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ.. ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసిన పిండితో దోశలు చేసుకొని తినడం మంచిదేనా? ఎక్కువ రోజులు స్టోర్ చేసిన పిండితో బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం…
దోశ పిండి తయారీ...
దోశ పిండిని బియ్యం, మినపప్పుతో చేస్తారు. ఈ రెండింటినీ 6 నుంచి 7 గంటలు నానపెట్టి తర్వాత రుబ్బుకుంటారు. ఆ తర్వాత దీనిని పులియబెడతారు. ఇలా పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే.. ఫ్రిజ్ లో పెట్టినా కూడా పులియ బెట్టే ప్రక్రియ ఆగదు. కేవలం నెమ్మదిగా జరుగుతుంది. అయితే.. పిండి రుబ్బుకున్న 3 రోజుల తర్వాత ఆ పిండిలోని కార్బో హైడ్రేట్స్ విచ్ఛిన్నమై, ఆల్కహాల్ వంటి పదార్థాలు హానికరమైన ఈస్ట్ పెరుగుతాయి.
పిండిని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో ఆమ్లత్వం పెరుగుతుంది. పిండి అలా మారిన తర్వాత దానితో చేసిన దోశ తినడం వల్ల కడుపులో మంట లేదా గుండెల్లో మంట రావచ్చు. పులిసిన పిండిలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఈ పిండితో చేసిన దోశలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇలా పులిసిన పిండితో చేసిన వంటలు పిల్లలు, ముసలివాళ్లు తినకపోవడమే మంచిది.

