- Home
- Feature
- Traffic Lights: రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్లాలి.. ఈ రంగులనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
Traffic Lights: రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్లాలి.. ఈ రంగులనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?
Traffic Lights: రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటిస్తుంటారు. రెడ్ లైట్ పడితే ఆగిపోవడం, ఆకుపచ్చ లైట్ వెలిగితే ముందుకు సాగడం, పసుపు రంగు కనిపిస్తే సిద్ధంగా ఉండటం తెలిసిందే. అయితే ఇందుకు ఈ రంగులనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

రైల్వే సిగ్నల్స్తో ప్రారంభమైన వ్యవస్థ
ట్రాఫిక్ లైట్ల చరిత్ర 1830–1840 కాలంలో బ్రిటన్ రైల్వేల దగ్గర మొదలైంది. ఆ రోజుల్లో రైళ్ల మధ్య ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు సంకేతాలు ఇవ్వడానికి ప్రత్యేక సిగ్నల్ వ్యవస్థ అవసరమైంది. అప్పుడు మూడు రంగులను ఉపయోగించేవారు. ఎరుపు – ప్రమాదం లేదా ఆగాలి, ఆకుపచ్చ – జాగ్రత్త, తెలుపు – మార్గం సురక్షితం. ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇంజినీర్ హెన్రీ బూత్ కీలక పాత్ర పోషించారు.

తెలుపు రంగుతో జరిగిన ప్రమాదం
మొదట్లో “ముందుకు వెళ్లొచ్చు” అనే అర్థంలో తెలుపు రంగును ఉపయోగించేవారు. కానీ రాత్రి సమయంలో డ్రైవర్లు తెలుపు లైట్ను దూరంలోని నక్షత్రాలు లేదా ఇతర వెలుగులతో పోల్చుకోవడంతో గందరగోళంలో పడ్డారు. ఒకసారి సిగ్నల్లో ఉన్న ఎరుపు గాజు పగిలిపోవడంతో లోపలున్న తెలుపు లైట్ కనిపించింది. డ్రైవర్ దాన్ని సురక్షిత సంకేతంగా భావించి రైలును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రైళ్ల ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఆ ఘటన తర్వాత అధికారులు తెలుపు రంగును పూర్తిగా తొలగించి, దాని స్థానంలో ఆకుపచ్చ రంగును తీసుకొచ్చారు. అలాగే పసుపు రంగును “జాగ్రత్త” సంకేతంగా నిర్ణయించారు.
ప్రపంచంలో తొలి ట్రాఫిక్ లైట్ ఎక్కడ పెట్టారు?
రైల్వే సిగ్నల్ విధానాన్ని తరువాత రోడ్లపై కూడా అమలు చేశారు. ప్రపంచంలో తొలి ట్రాఫిక్ సిగ్నల్ను 1868 డిసెంబర్ 10న ప్లేస్ ఆఫ్ వెస్ట్మినిస్టర్ బయట ఏర్పాటు చేశారు. దీనిని జాన్ పీక్ నైట్ రూపొందించారు. మొదట ఇది గ్యాస్తో పనిచేసే విధంగా ఉండేది. అప్పట్లో కేవలం ఎరుపు, ఆకుపచ్చ రంగులే ఉండేవి. ఒక పోలీస్ అధికారి చేతితో ఈ సిగ్నల్స్ను నియంత్రించేవాడు. తర్వాత 1912లో లెస్టర్ వైర్ తొలి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ను రూపొందించారు. ఆ తరువాత 1920లో విలియమ్ పాట్స్ ఆధునిక మూడు రంగుల ట్రాఫిక్ లైట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
ఆగడానికి ఎరుపు రంగునే ఎందుకు ఎంచుకున్నారు?
ఎరుపు రంగుకు శాస్త్రీయ కారణం ఉంది. కాంతి తరంగాల్లో ఎరుపు రంగు వెవ్లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది పొగ, వర్షం, దుమ్ము, పొగమంచులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మనిషి మనసులో కూడా ఎరుపు రంగు ప్రమాదం, హెచ్చరిక, అపాయం అనే భావనను కలిగిస్తుంది. అందుకే “ఆగాలి” అనే సంకేతానికి ఎరుపు రంగును ఉపయోగించడం ప్రారంభించారు.
ఆకుపచ్చ రంగు ముందుకు వెళ్లమనే సంకేతంగా ఎందుకు మారింది?
మన కళ్లు ఆకుపచ్చ రంగును చాలా త్వరగా గుర్తుపడతాయి. పగలు, రాత్రి రెండింట్లోనూ ఆకుపచ్చ కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల డ్రైవర్లు సులభంగా గుర్తించగలుగుతారు. ఇక పసుపు రంగును మధ్యస్థ హెచ్చరికగా ఉపయోగించారు. అంటే “త్వరలో సిగ్నల్ మారబోతోంది.. సిద్ధంగా ఉండండి” అనే అర్థం. ఇలా శాస్త్రీయ కారణాలు, భద్రతా అవసరాలు కలిసి నేటి ట్రాఫిక్ లైట్ వ్యవస్థను రూపొందించాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే రంగుల విధానం ఉండటానికి ఇదే కారణం.

