Biryani: బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తింటే ప్రాణాంతకమా? ఇందులో నిజమెంత?
Biryani: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ కలిపి తింటే ప్రాణాలు పోతాయా? అసలు ముంబై ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినడం గురించి వైద్యులు చెప్తున్న హెచ్చరికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బిర్యానీ తర్వాత పుచ్చకాయ తింటే డేంజరా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అది దావాగ్నిలా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల గురించి వచ్చే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల "బిర్యానీ తిన్న వెంటనే పుచ్చకాయ తిన్న ఒక కుటుంబం మరణించింది" అనే వార్త ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనతో చాలా మంది బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినాలంటేనే భయపడుతున్నారు. అయితే నిజంగానే బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడం ప్రమాదమా? ఇందులో శాస్త్రీయంగా ఎంతవరకు నిజముంది?
అసలు ఏం జరిగింది?
ముంబైకి చెందిన ఒక కుటుంబం రాత్రి సమయంలో బిర్యానీ తిని, ఆ తర్వాత డెజర్ట్గా పుచ్చకాయ ముక్కలు తిన్నారని, కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలు మొదలై పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగించింది. బిర్యానీ వంటి మసాలా ఆహారం తర్వాత చలువ చేసే పుచ్చకాయ తింటే శరీరంలో విషపూరితమైన కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. బిర్యానీ, పుచ్చకాయ కలిపి తినడం వల్ల శరీరంలో ఎలాంటి విష రసాయనాలు ఉత్పత్తి కావు. ఈ రెండింటి కలయిక నేరుగా మరణానికి కారణం అవుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి జఠర రసం తోడ్పడుతుంది. ఒకవేళ ఈ రెండు పదార్థాలు కలిసినా గ్యాస్ లేదా అజీర్తి వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు కానీ, ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం జరగదు.
మరణానికి అసలు కారణం ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు!
ఆ కుటుంబం మరణానికి ప్రధాన కారణం ఆహారాల కలయిక కాదు, ఆ ఆహారం కలుషితం కావడమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
1. బాక్టీరియా పెరుగుదల: బిర్యానీ వంటి మాంసాహార పదార్థాలను వండిన తర్వాత ఎక్కువ సేపు బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అందులో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
2. నిల్వ పండ్లు: బయట రోడ్ల మీద ముందుగానే కట్ చేసి ఉంచిన పుచ్చకాయ ముక్కలపై దుమ్ము, ధూళితో పాటు ప్రమాదకరమైన బాక్టీరియా చేరుతుంది.
3. కృత్రిమ రసాయనాలు: పుచ్చకాయలు ఎర్రగా, తీపిగా ఉండటానికి కొన్ని చోట్ల ప్రమాదకరమైన ఇంజెక్షన్లు, రంగులు వాడుతుంటారు. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తాయి.
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
ఆహారం ఏదైనా సరే అది తాజాది కాకపోతే ప్రమాదకరమే. బయట దొరికే కట్ చేసిన పండ్లను అస్సలు కొనకండి. అలాగే బిర్యానీ వంటి ఆహారాన్ని వండిన రెండు లేదా మూడు గంటల లోపు తినడం మంచిది. ఒకవేళ నిల్వ ఉంచాల్సి వస్తే సరైన ఉష్ణోగ్రతలో ఫ్రిజ్లో భద్రపరచాలి. ఆహారం వాసన చూసినప్పుడు లేదా రుచిలో తేడా అనిపించినప్పుడు మొహమాటం లేకుండా పారేయడమే ఉత్తమం.
బిర్యానీ తర్వాత పుచ్చకాయ తింటే చనిపోతారనేది కేవలం ఒక అపోహ మాత్రమే. అసలు సమస్య మనం తినే ఆహారపు నాణ్యత, శుభ్రతలో ఉంది. కాబట్టి అనవసరమైన పుకార్లను నమ్మి భయపడకండి, కానీ తినే ఆహారం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి.

