- Home
- Feature
- 10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
10 Largest Hindu Temples: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు.. మరి ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత భారీ, అద్భుతమైన 10 హిందూ దేవాలయాల వివరాలు, వాటి విశిష్ఠతలు, నిర్మాణ శైలి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు !
హిందూ ధర్మం ప్రకారం ఆలయం అంటే కేవలం దేవుడు ఉండే చోటు మాత్రమే కాదు, అది జ్ఞానోదయానికి ఒక మార్గం. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నిర్మాణ శైలితో, భారీ వైశాల్యంలో కొలువుదీరిన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. నాటి శిల్పుల నైపుణ్యం, నేటి ఆధునిక ఇంజనీరింగ్కు కూడా సవాల్ విసిరేలా ఉంటుంది. ప్రపంచంలోని టాప్ 10 భారీ హిందూ దేవాలయాల గురించిన వివరాలు గమనిస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం ఇండియాలో లేదు ! మరి ఎక్కడుంది? టాప్ 10 అతిపెద్ద ఆలయాలు ఏవి?
1. పశుపతినాథ్ ఆలయం, ఖాట్మండు (నేపాల్)
నేపాల్ రాజధాని ఖాట్మండులోని బాగ్మతి నది ఒడ్డున ఈ పవిత్ర క్షేత్రం ఉంది. దాదాపు 24.60 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ప్రాంగణంలో 518 చిన్న ఆలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. నేపాలీ పగోడా నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఇక్కడ గర్భాలయంలోని శివుడిని 'పశుపతినాథ్' అని పిలుస్తారు. ఇక్కడి పూజారులు భారత్ నుంచే వెళ్లడం ఒక విశేషం.
2. అంగ్కోర్ వాట్, కాంబోడియా
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడం ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు 'అంగ్కోర్ వాట్'. 162.6 హెక్టార్ల (దాదాపు 402 ఎకరాలు) భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం మొదట విష్ణుమూర్తి కోలువై ఉన్నారు. తర్వాత ఇది బౌద్ధ క్షేత్రంగా మారింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో 65 మీటర్ల ఎత్తున్న గోపురం ఉంటుంది. గోడల మీద రామాయణ, మహాభారత ఘట్టాలు చెక్కిన తీరు టూరిస్టులను మెస్మరైజ్ చేస్తుంది.
3. శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం (భారతదేశం)
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే పనిచేస్తున్న అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణాల్లో ఒకటి. 156 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో 21 గోపురాలు, 81 ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన గోపురాన్ని 'రాజగోపురం' అంటారు. ఇది 236 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే రెండో అతిపెద్ద గోపురంగా పేరు గాంచింది.
4. అక్షరధామ్, ఢిల్లీ (భారతదేశం)
యమునా నది తీరాన 100 ఎకరాల విస్తీర్ణంలో BAPS సంస్థ ఈ అద్భుత క్షేత్రాన్ని నిర్మించింది. 2005లో పూర్తయిన ఈ ఆలయం రాజస్థానీ పింక్ శాండ్స్టోన్, ఇటాలియన్ మార్బుల్తో చెక్కారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ భారీ కట్టడానికి ఎక్కడా కాంక్రీట్ లేదా ఇనుప సపోర్ట్ వాడలేదు. 234 చెక్కిన స్తంభాలు, 9 భారీ గోపురాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
5. బేలూర్ మఠం, హౌరా (భారతదేశం)
కోల్కతాలోని హూగ్లీ నది ఒడ్డున 40 ఎకరాల్లో స్వామి వివేకానంద ఈ మఠాన్ని స్థాపించారు. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన ఈ మఠం నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక వైపు నుంచి చూస్తే గుడిలా, మరో వైపు నుంచి చూస్తే చర్చిలా, ఇంకో వైపు నుంచి చూస్తే మసీదులా కనిపిస్తూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
6. ఏకాంబరేశ్వర ఆలయం, తమిళనాడు (భారతదేశం)
కాంచీపురంలోని పంచభూత లింగాలలో ఒకటైన ఈ ఆలయం 'పృథ్వీ లింగం' భూమికి ప్రతీక. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ రాజగోపురం 59 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక్కడ 'వేయి స్తంభాల మండపం' భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయం కింద ఒక రహస్య పవిత్ర నది ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం.
7. అన్నామలైయార్ ఆలయం, తిరువణ్ణామలై (భారతదేశం)
ఇది పంచభూత స్థలాలలో అగ్ని తత్త్వానికి ప్రతీక. ఇక్కడి శివలింగాన్ని అగ్ని లింగం అని పిలుస్తారు. 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలమైనది. విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఇక్కడ 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం 217 అడుగుల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది.
8. ప్రంబనన్ ఆలయం, జావా (ఇండోనేషియా)
ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులకు అంకితం చేశారు. అప్పట్లో ఇక్కడ 240 చిన్న ఆలయాలు ఉండేవని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యునెస్కో గుర్తించిన ఈ చారిత్రక కట్టడం హిందూ శిల్పకళా వైభవానికి నిదర్శనం.
9. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, కోల్కతా (భారతదేశం)
రాణి రాష్మోని నిర్మించిన ఈ ఆలయం 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు 'భవతారిణి' రూపంలో కొలువై ఉంటారు. రామకృష్ణ పరమహంస ఇక్కడే అమ్మవారిని దర్శించుకునేవారు. ప్రధాన ఆలయంతో పాటు బెంగాలీ శైలిలో నిర్మించిన 12 శివాలయాలు ఒకే వరుసలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
10. బిర్లా మందిర్ (లక్ష్మీ నారాయణ్ ఆలయం), ఢిల్లీ (భారతదేశం)
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ఈ ఆలయం 7.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1939లో మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పట్లో కులమత భేదం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలనే నిబంధనపైనే గాంధీజీ దీన్ని ప్రారంభించడం విశేషం. గీతా భవన్ వంటి భాగాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి.

