టీవీ షోలో కన్నీళ్ళు పెట్టుకున్న సంగీత.. ఎందుకంటే?
`ఖడ్గం` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన సంగీత చాలా రోజుల తర్వాత ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెప్పించారు. ఇన్నాళ్ళు తెలుగు ఆడియెన్స్ కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్టుండి ఓ షోలో కన్నీళ్లు పెట్టుకుంది.
తమిళనాడుకు చెందిన సంగీత 1997లో `గంగోత్రి` చిత్రంతో మలయాళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
1999లో తెలుగులో `ఆశల సందడి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి `ఖడ్గం` చిత్రంతో పాపులర్ అయ్యింది. అందులో విలక్షణ నటనతో గ్లామర్గానూ, నటన పరంగానూ మెప్పించింది. ఆ తర్వాత `నవ్వుతూ బతకాలిరా`, `ఆయుధం`, `ఖుషి ఖుషీగా`, `విజయేంద్ర వర్మ, `సంక్రాంతి`, `బహుమతి` వంటి చిత్రాల్లో మెరిసింది.
తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్ హీరోయిన్ల ముందు తట్టుకోలేక తమిళం, మలయాళ చిత్రాలకే పరిమితమైంది. చాలా కాలంగా ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు.
దాదాపు పదేళ్ళ తర్వాత సంగీత మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`లో కామెడీ తరహా పాత్రలో మెప్పించింది.
తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే `అక్కా ఎవరే అతగాడు?` షోలో పాల్గొంది. కమెడీయన్ల జీవితాలను ఆవిష్కరించిన ఈ షో ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో కమెడీయన్ల విషాద జీవితాలను ఆర్టిస్టులు ఆవిష్కరించగా, సంగీత కన్నీటి పర్యంతమయ్యారు.
దసరా సందర్భంగా ప్రసారమయ్యే ఈ ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్న సంగీత.. పూజకు వచ్చిన వారిలో మంచి అబ్బాయిలను సెలక్ట్ చేసి, తన ఇద్దరు చెల్లెళ్ళు రష్మి, వర్షిణిలకు పెళ్లి చేయాలని భావిస్తుంది. సంగీత ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, నవదీప్, సుధీర్ పాల్గొని సందడి చేయగా, సంగీత నవ్వులు పూయించింది.
ఆ తర్వాత ఇటీవల కాలంలో చనిపోయిన హాస్యనటులపై స్కిట్ ప్రదర్శించారు. ఆయా హాస్యనటుల కుటుంబ సభ్యులు ఆ స్కిట్కి కన్నీటి పర్యంతమయ్యారు. సంగీత సైతం ఏడుపు ఆపుకోలేకపోయారు. బోరున విలపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.