- Home
- Andhra Pradesh
- Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలవుతోంది. రాబోయే రోజుల్లో కొందరు పురుషులకు కూడా ఈ సౌకర్యం లభించనుంది. ఈ దిశగా తెలుగు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.

ఇక పురుషులకూ ఫ్రీ బస్...
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల మహిళలు ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండానే ఆర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు ఈ సౌకర్యం కల్పించాయి. ఆర్థికంగా బారం అయినప్పటికీ మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని అటు చంద్రబాబు సర్కారు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నాయి.
అయితే కేవలం మహిళలకేనా..? పురుషులేం చేశారు..? వారుకూడా ఓటేస్తేనేగా మీరు గెలిచింది.. ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది? అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు మగవారు. ఈ క్రమంలో ఆసక్తికర నిర్ణయాలు జరుగుతున్నాయి… అందరికి కాదుగానీ కొందరు మగాళ్లకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు... త్వరలోనే మగాళ్లు కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే రోజులు వస్తాయని స్వయంగా మంత్రులు వెల్లడిస్తున్నారు. ఇంతకూ ఈ ఉచిత ప్రయాణ సదుపాయం పొందే మగవారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీలో ఈ పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం...
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మహిళలు ప్రయాణిస్తున్నట్లే దివ్యాంగులు కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికే అధికారులు రాష్ట్రంలోని దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు..? వీరికి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో చేర్చితే అదనంగా ప్రభుత్వంపై పడే భారమెంత? అనే లెక్కలు సిద్దం చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం దివ్యాంగుల నుండి సగం ఛార్జీలనే వసూలు చేస్తోంది ఆర్టిసి... అంటే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే దివ్యాంగులు చెల్లించాలి. త్వరలో ఈ చార్జీలు కూడా లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది అమలయితే ఇక మహిళలతో పాటే దివ్యాంగులైన పురుషులు కూడా ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నమాట.
తెలంగాణలోనూ దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే కాదు తెలంగాణ సర్కార్ కూడా దివ్యాంగులకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ప్రయత్నాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. ఇప్పటికే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో దీనిగురించి మాట్లాడానని... త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా దివ్యాంగులు కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తారని... ఆ దిశగా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
అంటే తెలంగాణలో కూడా దివ్యాంగులైన పురుషులు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలుగు ప్రభుత్వాలు తమ సంక్షేమం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాప్యం చేయకుండా వెంటనే ఆర్టిసి బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకోవాలని వారు ప్రభుత్వాలను కోరుతున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్రాలివే..
కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అన్నిరకాల ఆర్టిసి బస్సుల్లో ఈ సౌకర్యం కల్పిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు పరిమిత బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.
తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీ శక్తి పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
కర్ణాటకలో శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు.
తమిళనాడులో "మగిలిర్ విడియల్ పయనం థిట్టం" కింద సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
డిల్లీ, పంజాబ్ లో పరిమిత ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది.

