మూడు గోల్స్ తో హౌస్ లోకి ఎంటరైన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్
మొదటివారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4, నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి మజా పంచింది. బిగ్ బాస్ హౌస్ నుండి డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేటై వెళ్లిపోగా కమెడియన్ కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్ కి రావడం వెనుక తనకు మూడు లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.
బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా మొదటివారం పూర్తి చేసుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉత్కంఠ రేపింది. శనివారమే ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ లో ముగ్గురు గంగవ్వ, అభిజిత్, జోర్దార్ సుజాత సేవ్ కావడం జరిగింది. ఆదివారం ఎపిసోడ్ లో మిగిలిన నలుగురు ఇంటి సభ్యులైన సూర్య కిరణ్, దివి, మెహబూబ్, అఖిల్ సార్థక్ లలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఉత్కంఠగా మారింది.
అయితే ప్రచారం జరుగుతున్నట్లుగానే నలుగురిలో తక్కువ ఓట్లు సంపాదించిన సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. నిన్న ఆయన హౌస్ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఒకరు వెళ్ళిపోయిన వెంటనే మరో కంటెస్టెంట్ ని కింగ్ నాగార్జున హౌస్ లోకి పంపించారు. నటుడు కుమార్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం జరిగింది.
ఇక హౌస్ లోకి వెళ్లబోయే ముందు బిగ్ బాస్ స్టేజ్ పై కుమార్ సాయి నాగార్జునతో తన ఫీలింగ్స్ పంచుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షోకి రావడానికి గల కారణాన్ని, తాను పెట్టుకున్న 3 లక్ష్యాలను చెప్పారు. మొదటి లక్ష్యంగా తాను బిగ్ బాస్ టైటిల్ కొట్టాలని, రెండవ లక్ష్యంగా తాను హౌస్ నుండి బయటికి వచ్చే నాటికి కరోనా పోయి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని. మూడో లక్ష్యంగా డైరెక్టర్ కావాలనుకుంటున్న తను, నాగార్జునకు స్క్రిప్ట్ వినిపించాలని పెట్టుకున్నారట. ఈ మూడింటిలో ఏది జరిగినా తాను హ్యాపీ అని కుమార్ సాయి చెప్పుకొచ్చారు.