‘లవ్స్టోరీ' ట్రైలర్: కేసీఆర్ పై శేఖర్ కమ్ముల పంచులు?
రిక్షావోనికి కొత్త రిక్షా ఇస్తే ఆడు రిక్షానే తొక్కుతాడు. గొర్రలోనికి గొర్రలిస్తే ఆడు గొర్రలే మేపుతాడు. ఇంకేం డవలప్ అయితాం సార్ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగు తెలంగాణా రాష్ట్రంలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోంది.
'ఫిదా’ తర్వాత మరోసారి అందమైన ప్రేమకథను శేఖర్ కమ్ముల తెరక్కించారు. ‘ఫిదా’లాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన ఈ లవ్ స్టోరీలోనూ నాగచైతన్య - సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకుంటున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మార్క్ నేచరల్ డైలాగులు ఈ సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. అప్పట్లో రానా తో చేసిన లీడర్ లో ప్రభుత్వాలను, నేటి రాజకీయాలపై తన వాడి వేడి డైలాగు అస్త్రాలు సంధించిన శేఖర్ కమ్ముల ఈ సారి ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పధకాలను టార్గెట్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది.
రిక్షావోనికి కొత్త రిక్షా ఇస్తే ఆడు రిక్షానే తొక్కుతాడు. గొర్రలోనికి గొర్రలిస్తే ఆడు గొర్రలే మేపుతాడు. ఇంకేం డవలప్ అయితాం సార్ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగు తెలంగాణా రాష్ట్రంలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోంది. కుల వృత్తులు నిర్వహిస్తున్న బీసీ వర్గాలను అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ ఈ పధకం ద్వారా అమలు చేస్తోంది. సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కులవృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహించేందుకు అలా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు నాగచైతన్య చెప్పే ఆ డైలాగు..ఆ పధకాన్ని గుర్తు చేస్తోంది. అలాగే సాయిపల్లవి సైతం బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం వేటలో ఉన్న అమ్మాయిగా ఇప్పుడు బయిట నిరుద్యోగల పరిస్దితిని చెప్తున్నట్లుగా ఉంది. ఏదైమైనా ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.
'బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవాని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడు.. ‘‘మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా?', 'బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం'’ ఈ డైలాగ్స్ లోతుగా గుండె లోతుల్లోంచి వచ్చినట్లున్నాయి. ఈ 'లవ్ స్టోరీ' లో రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.
‘లవ్స్టోరీ’లోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సి.హెచ్., ఛాయాగ్రహణం: విజయ్ సి. కుమార్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్.