బీఎస్-6 ఎఫెక్ట్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?
బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలోకి విడుదల చేస్తున్న వాహనాల్లో వాడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగనున్నాయని కేంద్రీయ ముడి చమురు సంస్థలు నిర్ధారించాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు అనుగుణంగా వినియోగించే పెట్రోల్ వాడకంలో మార్పులు తీసుకు రానున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పాత వాహనాల రిజిస్ట్రేషన్లకు మార్చి 31వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను ప్రముఖ కంపెనీలు గడువుకు ముందే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
దీంతో భాగంగానే దేశీయంగా ఉన్న అన్ని చమురు పంపిణీ సంస్థలు బీఎస్-6 ఇంధనాన్ని మాత్రమే సరఫరా చేసేందుకు సన్నద్ధం అయ్యాయి. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే బీఎస్-6 ఇంధనాలను ఏప్రిల్ 1 నుంచి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం వెల్లడించింది.
తక్కువ స్థాయిలో సల్ఫర్ ఉన్న పెట్రోల్, డీజిల్ను ఉత్పత్తి చేసేందుకు తమ రిఫైనరీలను రూ.17వేల కోట్లతో అప్గ్రేడ్ చేశామని దేశంలోనే అతిపెద్ద చమురు పంపిణీ సంస్థ ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వెల్లడించారు.
దేశం మొత్తం కొత్త ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వాడనుండటంతో ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలు స్వల్పంగా పెరిగా అవకాశం ఉన్నదని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఐతే ఎంతమేర ఆయిల్ రేట్లు పెరుగుతాయనే విషయాన్ని ఆయన చెప్పలేదు.
ప్రస్తుత బీఎస్-4 ఇంధనంతో పోలిస్తే బీఎస్-6 ఇంధనంలో కేవలం తక్కువ మోతాదులో సల్పర్ ఉంటుందని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. ఐతే భారీ స్థాయిలో ఆయిల్ ధరలు పెంచి వినియోగ దారులపై భారం వేయబోమని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వ చమురు సంస్థలు తమ రిఫైనరీలను ఆధునీకరించేందుకు సుమారు 35వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాయని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ వివరించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ, గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు.
కాగా బీపీసీఎల్ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్జీసీకి చెందిన హెచ్పీసీఎల్ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్పీసీఎల్ ఇప్పటికే ప్రకటించింది.