దేశీయ విపణిలోకి రాయల్ ‘ట్రయల్స్’.. రూ.1.62-2.07 లక్షలకే లభ్యం
ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ భారతదేశ మార్కెట్లోకి రెండు బైక్లను ఆవిష్కరించింది. ట్రయల్ 350 బుల్లెట్ ధర రూ.1.62 లక్షలు, ట్రయల్ 500 బుల్లెట్ రూ.2.07 లక్షలకు అందుబాటులోకి రానున్నది.
ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ రెండు బుల్లెట్ ట్రయల్స్ బైక్లను భారతదేశ విపణిలోకి విడుదల చేసినట్లు ప్రకటించింది. బుల్లెట్ ట్రయల్స్ 500 ధర రూ.2.07 లక్షలు కాగా, బుల్లెట్ ట్రయల్స్ 350 ధర రూ.1.62 లక్షలుగా నిర్ణయించారు.
డ్యూయల్ ఛానెల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ట్రిమ్డ్ మడ్గార్డ్స్, సింగిల్ సీట్, లగేజీ క్యారియర్ వంటి సౌకర్యాలు ఈ బైక్ల సొంతం. బుల్లెట్ ట్రయల్స్ 500 బైక్ను 498 సీసీ ఇంజిన్ సామర్థ్యం, బుల్లెట్ ట్రయల్స్ 350 బైక్ను 348 సీసీ పవర్ట్రైన్ సామర్థ్యంతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. రెండు బైక్ల్లోనూ 5- స్పీడ్ గేర్ బాక్స్ సెటప్ ఏర్పాటు చేశారు.
‘బుల్లెట్ ట్రయల్స్ 2019 మోటార్ సైకిల్, జానీ బ్రిటన్స్ ట్రయల్స్ మోటార్ సైకిల్ స్ఫూర్తితో రూపొందించాం. 1948-65 మధ్య కాలంలో దాదాపు 50కి పైగా ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్న బైక్లు అవి. వాటికి నివాళిగా వీటిని రూపొందించాం. ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు కొనుగోలు చేసే వినియోగదారుల్ని ఎక్కువగా ఆకట్టుకొనే అవకాశం ఉంద’ని రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ హెడ్, ప్రొడక్ట్ స్ట్రాటర్జీ ఇండస్ట్రియల్ డిజైన్ మార్క్ వెల్స్ తెలిపారు.
ట్రయల్ 350 మోడల్ బైక్లో సింగిల్ సిలిండర్ ఇంజిన్, 20 హెచ్ పీ అండ్ 28 ఎన్ఎం టార్చి సామర్థ్యం అమర్చారు. ఇక ట్రయల్ 500 బైక్ లోనూ 499 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్తోపాటు 27.5 హెచ్పీ, 41.3 ఎన్ఎం టార్చి అమర్చారు.