200 రోజులకు చేరుకొన్న జగన్ పాదయాత్ర: రాజన్న రాజ్యం తెస్తా: వైసీపీ (వీడియో)
మరో మైలురాయికి చేరుకొన్న జగన్ పాదయాత్ర
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకొన్న సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన ఏపీ ప్రజలకు జగన్ బుధవారం నాడు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో రాజన్న రాజ్యం తెచ్చి ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తేవడమే తన సంకల్పమని జగన్ ట్వీట్ చేశారు.ప్రజా సంకల్ప యాత్ర తొలి రోజు నుండే ప్రజల ముఖాల్లో రాబోయే రేపటి ఆశలను చూశానని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
నాలుగేళ్ళుగా చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను ఏ రకంగా విస్మరిస్తున్నారనే విషయమై వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం నాటికి 200వ రోజుకు చేరుకొంది.దీంతో వైఎస్ జగన్ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం నాటికి వైఎస్ జగన్ 2,434 కి.మీ నడిచారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర కారణంగానే కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ పాదయాత్ర ప్రభావం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
"