నరసరావుపేట పర్యటనకు బయలుదేరిన లోకేష్... గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత (వీడియో)
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ పర్యటనకు అనుమతించని పోలీసులు ఎయిర్ పోర్టు వద్దే ఆయనను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
అమరావతి: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లాలని నిర్ణయించుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. లోకేష్ నర్సరావుపేట పర్యటనకు పోలీసులు నిరాకరించగా... ఎట్టి పరిస్థితుల్లోనూ అనూష కుటుంబాన్ని పరామర్శిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. దీంతో గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇప్పటికే లోకేష్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు.కొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న లోకేష్ అక్కడినుండి రోడ్డుమార్గంలో నరసరావుపేటకు చేరుకోనున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయం వద్దే లోకేష్ ను అడ్డుకోడానికి పోలీసులు భారీగా మొహరించారు.
read more గుంటూరు మహిళపై గ్యాంగ్ రేప్ దారుణం...బాధితులతో పోలీసుల తీరు మరీ ఘోరం: లోకేష్ సీరియస్
గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఇతర ప్రయాణికులను కూడా అడ్డుకుంటున్నారు. తమవారికి వీడ్కోలు పలకడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులను విమానాశ్రయం బయటే ఆపేస్తున్నారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో
మరోవైపు ఎయిర్ పోర్ట్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. వారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు. దీంతో గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కోవిడ్ నేపద్యంలో నారా లోకేష్ పర్యటన కు అనుమతి లేదు అంటున్న గుంటూరు పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, టిడిపి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి భచ్చుల అర్జునుడుతో పాటు సీనియర్ నాయకులు బడేటి రాధాక్రుష్ణయ్య(చంటి) ని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గన్నవరం విమానాశ్రయం, నరసరావుపేటకు చేరుకోడానికి ప్రయత్నిస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.