ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

By telugu teamFirst Published Aug 23, 2019, 3:02 PM IST
Highlights

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఆయన దాన్ని తరలించే సాహసం చేస్తారా అనేది ప్రశ్న. అమరావతి విషయంలో అసలు జగన్ వ్యూహం మరో రకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతి: అమరావతి విషయంలో మునిసిపల్ శాఖా మంత్రి బొత్స మాటలతో, విజయసాయి రెడ్డి ట్వీట్ తో అసలు జగన్ ఏం చేయబోతున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజధానిని మారుస్తున్నారా అనే ప్రశ్నకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ ఆయన కార్యాలయం కానీ స్పందించలేదు. మంత్రి గౌతమ్ రెడ్డి మాత్రం అలాంటిదేం లేదని అన్నారు తప్ప జగన్ నేరుగా స్పందించలేదు. బొత్స ఏదో అన్నారులే అని కొద్దిసేపు అనుకున్నా, విజయసాయిరెడ్డి మాటను మాత్రం అంత తేలికగా తీసేయలేం. ఎప్పటినుండో రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన విజయసాయిరెడ్డి జగన్ గెలుపు కోసం ఎంత కృషి చేసాడో చెప్పనవసరం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి జగన్ కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ట్వీట్ ను మాత్రం తేలికగా తీసుకుంటే పొరపాటే అవుతుంది. దానికి తోడు, ఆ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా జగన్ స్పందించక పోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. 

ఇంతకు వైసీపీ రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? నిజంగానే రాజధానిని మారుస్తారా లేదా రెండో రాజధానిగా వేరే ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ అన్ని విషయాలకు సమాధానాలు కావాలంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. ఒక్కో అంశాన్ని వేరువేరుగా చూసినప్పుడు వాటిలో ఒకదానికి మరోదానితో సంబంధం లేదన్నట్టుగా కనపడ్డప్పటికీ కలిపి చూస్తే మాత్రమే అసలు స్కెచ్ అర్థమవుతుంది. 

మొదటగా అమరావతి విషయానికి వద్దాం. వైసీపీ శ్రేణులు తరచు చెప్పే మాట శివరామకృష్ణన్ కమిటీ సూచనలకు విరుద్ధంగా ఈ రాజధానిని నిర్మించారని. అంతే కాకుండా రైతుల భూములను అవసరానికి మించి లాక్కున్నారనేవి ప్రధాన ఆరోపణలు. వీటిలో నిజం లేకపోలేదు కూడా. అయితే ఇప్పుడు జగన్ నిజంగా రాజధానిని మారుస్తాడా? అసలే నిధులు లేక రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వేరేచోటికి తరలించాలంటే అక్కడ అంతా మొదటినుంచి నిర్మించాలి. అప్పుడు ఖర్చు రెండింతలవుతుంది. మళ్లీ భూములను సేకరించడం నుంచి కొత్తగా మొదలుపెట్టాలి. 

ఉన్న రాజధాని నిర్మాణానికే డబ్బులు లేక కేవలం రూ 500 కోట్లని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ కేంద్రం ఏమన్నా సహాయం చేస్తుందా అంటే ఆ ఛాయలు కూడా కనపడడం లేదు. సరే పోనీ రైతులకు భూములను తిరిగి ఇచ్చేసి ఇక్కడ భూమి లేదని చెబుదామన్నా రైతులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. భూమి రూపురేఖలను పూర్తిగా మార్చివేయడంతో ఇప్పుడు ఎవరి భూమి ఎక్కడ ఉందొ గుర్తుపట్టడం దాదాపుగా అసాధ్యమైనపని. 65వేల రూపాయల కౌలు కూడా వస్తుంది, భూముల రేట్లు అమాంతం పెరిగాయి. 

ఇంకో విషయం ఏంటంటే ఈ రాజధాని ప్రాంతంలోని మొత్తం భూములు ఒకే రకమైన సారవంతమైన భూములు కావు. కేవలం కృష్ణానది పరిసర ప్రాంతాలు మాత్రమే సారవంతమయినవి తప్ప గుంటూరు వైపుగా వెళ్తున్న కొద్దీ భూముల్లో సారం తగ్గుతుంది. ఇలాంటి రైతులు తమ భూములను వేరే రైతుకు కౌలుకిస్తే 65వేల రూపాయల కౌలు నిజానికి రాదు. ఖాళీగా ఇంకా నిర్మాణాలు మొదలుపెట్టనిచోట పంటలను కొందరు అనధికారికంగా సాగుచేస్తున్నారు కూడా. ఇన్ని సౌలభ్యాలు ఉన్నప్పుడు భూములు వెనక్కి తీసుకోవడానికి ఎవరు మాత్రం ముందుకు వస్తారు?

ఈ కారణాల వల్ల రాజధానిని తరలించడం కష్టమైన పనిగా మనకు అర్థమవుతుంది. మరి జగన్ ఎం చేస్తాడు? చంద్రబాబు చెప్పినట్టే సింగపూర్ ను తలదన్నే రాజధానిని నిర్మిస్తాడా? దీనికి సమాధానాలు దొరకాలంటే రాజకీయంగా ఆ ప్రాంతాల చరిత్రను, వారి జనాభా లెక్కలను ఒకసారి పరిశీలించాలి. రాజధాని నిర్మాణాన్ని ఎజెండాగా చేసుకొని ఎన్నికలకు వెళ్తే గెలవలేమన్న విషయం చంద్రబాబు ఓటమి నిరూపించింది. దానికి తోడు, ఇక్కడి భూములు అధిక శాతం ఒక సామాజివర్గ చేతుల్లో ఉన్నాయి. రాజకీయంగా వారు జగన్ వెంట నడిచే అవకాశాలు చాల తక్కువ. కాబట్టి ఇక్కడ అంత గొప్ప రాజధానిని నిర్మించినా దాని నుండి లాభపడేది ముఖ్యంగా ఆ సామాజిక వర్గమే. సో పొలిటికల్ మైలేజీ అంతగా లభ్యమవ్వకపోవచ్చు. 

జగన్ రాజధానిని తరలించకపోవచ్చు. మరి చంద్రబాబు చెప్పినట్టుగా 3డి లో చూపెట్టినట్టుగా నిర్మించడనేది స్పష్టం. మరి ఏం చేయబోతున్నాడు. ఇవి అవగతం అవ్వాలంటే ఒక రెండు రోజుల కింద జగన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని మనం నిశితంగా గమనించాలి. అదే ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా బోర్డు రద్దు. పూర్తి రాష్ట్రాన్ని ఒకే బోర్డు కిందకు కాకుండా నాలుగు ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీనిని ఇక్కడెందుకు ప్రస్తావించాల్సివచ్చిందంటే, ఇలా వేర్వేరు చోట్ల బోర్డులను ఏర్పాటు చేసినప్పుడు జరిగేది అధికార వికేంద్రికరణ. 

కాబట్టి ప్రస్తుత రాజధానిని అమరావతిలోనే ఉంచి మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడంకోసం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలను, ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయచ్చు. ఇప్పటికే ఉత్తరాంధ్ర వారికి, రాయలసీమ ప్రాంతం వారికి అమరావతి దూరమవుతుందని ఆ ప్రాంతాల ప్రజలు అసంతృప్తిని వెలిబుచ్చిన సందర్భాలు మనకు తెలుసు. అంతే కాకుండా వైసీపీ శ్రేణులు, అధికారంతో పాటు అభివృద్ధి కూడా అమరావతిలోనే కేంద్రీకృతమవుతుందని టీడీపీని వారు అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో విమర్శించారు కూడా. 

ఇన్ని అంశాలను పరిశీలించిన తరువాత టూకీగా అర్ధమయ్యే విషయమేంటంటే, అమరావతిని పరిపాలనా రాజధానిగా ఉంచి, మిగిలిన ప్రాంతాల్లో వేర్వేరు శాఖలను,  ప్రభుత్వ కార్యాలయాలను సంస్థలను ఏర్పాటుచేసి అధికార వికేంద్రీకరణ జరపాలనేది జగన్ వ్యూహంగా మనకు కనపడుతుంది.  ఇలా చేస్తే ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తామని భావిస్తోంది జగన్ సర్కార్. ఆయా ప్రాంతాల్లో ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేస్తే అక్కడ అభివృద్ధి కూడా ఊపందుకుంటుంది. దీనితో రాష్ట్రం ఎదుర్కుంటున్న ముఖ్య సమస్య అయిన ప్రాంతీయ అసమానతలను ఎదుర్కోవచ్చు అని ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. 

ఎన్నికల్లో దాదాపుగా రాయలసీమంతా రెండు స్థానాలు మినహాయిస్తే జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది. జగన్ ముఖ్యమంత్రి అవడంతో వారిలో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికోసం కృషి చేస్తుందని ఆశలు రేకెత్తాయి. వారిని సంతోషపరచడానికి శ్రీభాగ్ ఒడంబడికను అనుసరించి హైకోర్టును రాయలసీమకు తరలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు!
 

సంబంధిత వార్తలు

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

click me!