న‌గ‌ల దుకాణంలో గ‌న్‌ఫైర్ చేస్తూ చోరీలు జ‌ర‌గ‌డం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సంఘ‌ట‌న తాజాగా హైద‌రాబాద్‌లో నిజంగానే జ‌రిగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌లోని చందానగర్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. ఖజానా జ్యువెలరీ షాప్‌లోకి దూసుకెళ్లిన ఆరుగురు దుండగులు గన్‌ఫైర్‌ చేస్తూ భారీ దోపిడీ చేశారు. ఉదయం షాప్‌ తెరచిన ఐదు నిమిషాల్లోనే ఈ సంఘటన జరిగిపోవడం ప్రాంతంలో కలకలం రేపింది.

గన్‌తో భయపెట్టిన దుండగులు

మాస్కులు ధరించిన ఆరుగురు వ్యక్తులు షాప్‌లోకి ప్రవేశించి సిబ్బందిని గన్‌తో బెదిరించారు. వెంటనే రెండు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. సీసీ కెమెరాలు రికార్డు చేయకుండా ఉండేందుకు వాటిపై కూడా ఫైర్‌ చేశారు.

దొంగలు డిప్యూటీ మేనేజర్‌ కాళ్లపై కాల్పులు జరిపి గాయపరిచారు. గాయపడిన ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి సమయంలో సిబ్బంది, కస్టమర్లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

నిమిషాల్లోనే దోపిడీ

దోపిడీ జ‌రిగిన తీరు చూస్తుంటే దుండ‌గులు ముందుగానే పక్కా ప్లాన్ వేసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేవ‌లం ఐదు నిమిషాల్లోనే విలువైన బంగారం, నగలు తీసుకొని పారిపోయారు. దోపిడీ జ‌రిగిన తీరు చూసిన పోలీసులు ఇది ప‌క్కా ప్రొఫెషనల్‌ గ్యాంగ్‌ పని అని భావిస్తున్నారు.

జహీరాబాద్ వైపు పరారీ

దోపిడీ అనంతరం దుండగులు బైక్‌లు, కార్లతో జహీరాబాద్ వైపు దూసుకెళ్లారు. వెంటనే జిల్లాల సరిహద్దులను అలర్ట్‌ చేసి పోలీసులు వేట ప్రారంభించారు. సైబరాబాద్‌ సీపీ ఈ ఘటనపై కఠిన చర్యలకు ఆదేశించారు. దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.