- Home
- Telangana
- Hyderabad: రూ. 1500 కోట్లతో 50 అంతస్తుల్లో.. హైదరాబాద్లో ఐకానిక్ బిల్డింగ్. ఎన్నో అద్భుతాలు
Hyderabad: రూ. 1500 కోట్లతో 50 అంతస్తుల్లో.. హైదరాబాద్లో ఐకానిక్ బిల్డింగ్. ఎన్నో అద్భుతాలు
హైదరాబాద్ మహా నగరంలో మరో అద్భుతమైన నిర్మాణం జరగనుంది. గచ్చిబౌలిలో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇంతకీ ఏంటీ నిర్మాణం.? దీని ప్రత్యేకత ఏంటి.? లాంటి విషయాలు తెలుసుకుందాం..

గచ్చిబౌలిలో 50 అంతస్తుల యూనిటీ మాల్
హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది. 5.16 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తుల యూనిటీ మాల్ టవర్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో కేంద్రం రూ.202 కోట్లు కేటాయించగా, మొదటిదశలో రూ.101 కోట్లు విడుదల చేసింది.
KNOW
చేనేత, హస్తకళలకు ప్రత్యేక స్థానం
ఈ భవనం మొత్తం 29 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాల కోసం ఐదు బేస్మెంట్లు ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఆరు అంతస్తులను దేశవ్యాప్తంగా ఉన్న చేనేత, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం కేటాయిస్తారు. మిగిలిన 39 అంతస్తులను వాణిజ్య కార్యాలయాలు, బిజినెస్ సెంటర్లకు వినియోగించనున్నారు.
పీపీపీ మోడల్లో అమలు
ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులతో సమావేశమై టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేంద్ర పర్యవేక్షణ, ఆమోదాలు
కేంద్రంలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఈ ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షిస్తోంది. విడుదలైన నిధులను 2026 మార్చి 31 లోపు వినియోగించాలని సూచించింది. ఇప్పటికే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఆమోదించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 2025 ఏప్రిల్ 25న నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది.
సాంస్కృతిక వారసత్వానికి వేదిక
‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ మాల్స్ ద్వారా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు లభించనుంది. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, హైదరాబాద్ను ముఖ్యమైన వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా నిలపడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.