హనీమూన్ కోసం కులు మనాలీ వెళ్లి.. పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిన హైదరాబాద్ మహిళా టెక్కీ..
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ యువతి తన భర్తతో కలిసి హనీమూన్ కు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. అయితే అక్కడ కులు-మనాలీలో పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
హనీమూన్ కోసం హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దంపతులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. అయితే కులు-మనాలీలో పారాగ్లైడింగ్ చేస్తుండగా మహిళా టెక్కీ లోయలో పడిపోయింది. దీంతో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దంపతులు ఇద్దరూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు. అయితే ఆమెను భర్త ఎయిమ్స్ కు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు.
శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్సీపీ కోర్ కమిటీ.. మళ్లీ ఆయనే చీఫ్ గా ఉండాలని ప్రతిపాదన
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల గొల్లమండల ప్రీషీనా కు, 29 ఏళ్ల అజయ్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. ఇద్దరూ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ సమయం లేకపోవడంతో కొంత కాలం తరువాత హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వేసవి కాలం రావడంతో ఇక్కడున్న ఎండ వేడిమిని తప్పించుకునేందుకు ఇదే మంచి సమయమని భావించి ఈ జంట హిమాచల్ ప్రదేశ్ లోని కులు-మానాలీని వెళ్లానని నిర్ణయించుకున్నారు.
ఈ జంట ఏప్రిల్ 30వ తేదీన మనాలీ చేరుకుంది. మరుసటి రోజు కులును సందర్శించింది. పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ప్రయత్నించాలని అనుకున్నారు. అయితే మొదటగా ప్రీషీనా పారాగ్లైడింగ్ చేయడానికి భయపడింది. కానీ ట్రై చేస్తే భయం పోతుందని ఇన్ స్ట్రక్చర్ చెప్పడంతో ఆమె అంగీకరించింది. అయితే గో అనే పదం విన్న తరువాత ఆమె ఫిక్స్డ్ పాయింట్ నుంచి టేకాఫ్ కాకుండా డయాగ్నల్ గా వెళ్లడంతో ఆమె సరిగా పారా గ్లైడింగ్ చేయలేకపోయింది. దీంతో ఓ చెట్టును ఢీకొట్టి దాదాపు 15 అడుగుల లోతులో పడిపోయింది.
ఆమె ధరించిన పారాచూట్ కూడా సరిగ్గా తెరుచుకోలేదు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రీషీనా నిలబడలేకపోవడంతో ఆరుగురు వ్యక్తులు ఆమెను పైకి లేపి మనాలీ హాస్పిటల్ కు తరలించారు. ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు తెలిపారు. కానీ ఆమె భర్త అజయ్ కు అనుమానం రావడంతో ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన తరువాత ప్రీషీనా తీవ్రమైన వెన్నునొప్పి, రెండు కాళ్ళలో బలహీనతను ఎదుర్కొంటోందని అక్కడి న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా గుర్తించారు.
వెంటనే డాక్టర్ దీపక్ గుప్తా నేతృత్వంలోని బృందం మూడు గంటల పాటు ఆపరేషన్ చేసింది. ఆమెకు సకాలంలో చికిత్స అందించకపోతే పరిస్థితి మరింత దిగజారేదని డాక్టర్ తెలిపారు. అయితే బాధితురాలిని లోయలో పడిన తరువాత పైకి లేపి, ప్రాథమిక చికిత్స చేసిన విధానం ఎక్కువ నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు. ఇలాంటి ప్రమాదం జరిగిన సందర్భాల్లో రోగులను ముందుగా వెన్నెముక బోర్డుపై కూర్చోబెట్టాలని డాక్టర్ సూచించారు. అయితే ప్రస్తుతం ప్రీషీనా కోలుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.