చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య
తెలంగాణలోని పాల్వంచలో సొంత అన్న చెల్లెపై అత్యాచారం చేశాడు. ఆ అవమాన భారాన్ని మోయలేక బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. అతని మిత్రుడు కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు.
కొత్తగూడెం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. తప్పతాగి తన మిత్రుడితో కలిసి అన్న చెల్లెలిపై అత్యాచారం చేశాడు. ఆ అవమాన భారం భరించలేక చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాల్వంచలో జరిగింది. బాధితురాలిని పిప్పిడి వెంకటి, రాధమ్మ దంపతుల చిన్న కూతురు భూమికగా గుర్తించారు. ఆమెకు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు ఓ వివాహానికి హాజరు కాడానికి ఊరికి వెళ్తూ కూతురు భూమికను అన్న రాంబాబు ఇంటిలో వదిలి వెళ్లారు. అయితే, రాంబాబు రాత్రి జ్యోతినగర్ లోని తన తలిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో అవమానభారంతో పురుగుల మందు సేవించి బాలిక ఆత్మహత్య చేసుకుంది.
పురుగుల మందు తాగిన భూమికను స్థానికులు కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మరణించింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో తండ్రి కూతురిపై అత్యాచారం చేసిన ఘటనను మరిచిపోక ముందే సొంత అన్న చెల్లెలిపై అత్యాచారం చేయడం స్థానికులను కలవర పరుస్తోంది.