బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగిందంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ హాజ‌ర‌య్యారు.

ఆర్థిక శాఖకు ప్రాజెక్టుతో సంబంధం లేదు

భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రకారం, తాను భారాస ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుల వద్దే ఉందని వెల్లడించారు.

ఆనకట్టల నిర్మాణం క్యాబినెట్‌ నిర్ణయమే

ఆనకట్టల నిర్మాణం ప్రభుత్వ క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం ఆధారంగా జరిగిందని చెప్పారు. సాంకేతిక కమిటీ, క్యాబినెట్‌ సబ్‌కమిటీ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభ స్థానాన్ని తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక మహారాష్ట్ర అభ్యంతరాలు, సెంట్రల్ వాటర్ కమిషన్‌ (CWC) సూచనలు ఉన్నాయని వివరించారు.

కార్పొరేషన్‌ ఏర్పాటుకి కారణం నిధుల కొరత

ప్రాజెక్టు అమలులో నిధుల కొరత కారణంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఈటల చెప్పారు. పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాల కోసం డబ్బు వసూలు చేయాలన్న ప్రతిపాదనలు డీపీఆర్‌లో ఉన్నాయని వివరించారు.

నిర్మాణ బాధ్యత పూర్తిగా నీటిపారుదల శాఖదే

బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపై ప్రశ్నించిన కమిషన్‌కు ఈటల త‌న వాద‌న వినిపించారు. నిర్మాణాలకు సంబంధించిన ప్రతి అంశం నీటిపారుదలశాఖ పరిధిలోనే ఉంద‌ని అన్నారు. తాను నిజాన్ని మాత్రమే మాట్లాడతానని, భయపడి తప్పుల్ని కప్పిపుచ్చే వాడిని కాదని చెప్పారు. త‌ల‌పై తుపాకి పెట్టినా నిజ‌మే చెబుతాన‌ని తేల్చి చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వాడొద్దు

కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ఈట‌ల అన్నారు. ప్రాజెక్టుకు నష్టాన్ని కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్త ప్రభుత్వం అన్ని నివేదికలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. తన పాత్రలో ఎలాంటి అవినీతి లేద‌ని, నైతిక విలువలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చారు.