- Home
- Telangana
- Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్లకల్లోలం ఖాయం
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్లకల్లోలం ఖాయం
Rain Alert: ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కూల్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు తీవ్ర ప్రభావం
మార్చి 15 నుంచి 17 తేదీల మధ్య తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 40 నుంచి 50 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేవలం వర్షం మాత్రమే కాకుండా గాలి వేగం కూడా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. గంటకు సుమారు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశముందని అంచనా.
మార్చి 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు
వాతావరణ నిపుణుల ప్రకారం అసలు ప్రభావం మార్చి 18 నుంచి 20 మధ్య కనిపించే అవకాశం ఉంది. ఈ మూడు రోజులలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైతులకు సూచనలు
ఈ అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వడగళ్ల వానల వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వారు ఉరుములు-మెరుపులు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచిస్తున్నారు. చెట్ల కింద నిలబడడం, ఎలక్ట్రిక్ స్తంభాల దగ్గర ఉండడం ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కూడా సూచించింది.
హైదరాబాద్లో భారీ వర్షాలు
హైదరాబాద్లో మార్చి 18, 19 తేదీల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది. ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ద్రోణి ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితులు
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వ్యవస్థ ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా ఏర్పడి తెలంగాణ ఉత్తర ప్రాంతం వరకు విస్తరించిందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

