- Home
- Telangana
- Weather Alert : అగ్నిగుండమైన తెలంగాణ, అప్పుడే 40°C ఏంటి సామీ..! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
Weather Alert : అగ్నిగుండమైన తెలంగాణ, అప్పుడే 40°C ఏంటి సామీ..! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
Telangana Weather Update : వేసవి ఆరంభంలోనే ఎండలు ఆగమాగం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి… ఇక్కడ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.

ఇవేం ఎండల్రా నాయనా..!
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి... ఏకంగా 40 డిగ్రీలను క్రాస్ చేశాయి. భానుడి భగభగలకు ఉక్కపోత, వడగాలులు తోడవడంతో మధ్యాహ్నం బయటకు వెళ్ళడానికి కాదు ఇంట్లో ఉండటానికి భయపడే పరిస్ధితి ఉంది. తెలంగాణలో అయితే ఎండల తీవ్రత మరీ దారుణంగా ఉంది... హైదరాబాద్ లో సైతం అల్లాడిస్తోంది.
తెలంగాణ జిల్లాల్లో మండుటెండలు..
నిన్న (మార్చి 13, శుక్రవారం) తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఏకంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... దీన్నిబట్టే ఈ జిల్లాలో ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక మహబూబ్ నగర్ లో 40, ఆదిలాబాద్ లో 39.3, ఖమ్మంలో 39, నిజామాబాద్ 38.8, రామగుండం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యధిక టెంపరేచర్స్ ఇక్కడే... రెడ్ అలర్ట్
ప్రాంతాలవారిగా చూసుకుంటే భద్రాద్రి జిల్లా అశ్వాపురం, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 40.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక ఖమ్మం జిల్లా ముదిగొండ, నిజామాబాద్ జిల్లా మోస్రాలో 40.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లి, కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 39.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ వాతావరణం..
రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధికంగా హకీంపేటలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక దుండిగల్ లో 37.5, బేగంపేటలో 37.2, హయత్ నగర్ లో 37, రాజేంద్ర నగర్ లో 36.5, పటాన్ చెరులో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శివారు ప్రాంతాల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 38.6, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు...
అయితే మండుటెండలతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ (మార్చి 14, శనివారం) ఒక్కరోజే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని... రేపటి (మార్చి 15, ఆదివారం) నుండి వాతావరణం పూర్తిగా మారిపోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లబడుతుందని... కొన్ని జిల్లాల్లో వర్షాలు కూడా మొదలవుతాయని తెలిపింది.
రేపట్నుంచి వర్షాలు..
ఈ ఆదివారం అంటే రేపు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

