ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం సంగారెడ్డిలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌మావేశంలో ఆయ‌న ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్‌ అంటే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటే మెదక్‌ అని అన్నారు. మెదక్ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని ఆయన ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. జహీరాబాద్‌ నిమ్జ్‌ (NIMZ) ఏర్పాటుకు భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని ‘గేట్‌వే ఆఫ్ ఇండస్ట్రీస్’గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నారాయణ్‌ఖేడ్‌ అభివృద్ధికి ప్రత్యేక సమీక్ష

ఇక నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గ అభివృద్ధికి త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, అవసరమైన నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పటాన్‌చెరు ప్రాంతాన్ని సీఎం మినీ ఇండియాగా అభివ‌ర్ణించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది అని గుర్తు చేశారు. సింగూరు ప్రాజెక్టును ‘ఎకో టూరిజం’ హబ్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

కోటి మంది మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా శ‌క్తివంతంగా చేయ‌డం ల‌క్ష్యం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని సీఎం తెలిపారు. ఆరేళ్లలోపు కోటి మంది మహిళలను ఆర్థికంగా శక్తివంతులుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుందన్నారు. మహిళలు అదానీ, అంబానీలతో పోటీపడి వ్యాపారంలో నిలబడేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.

 

Scroll to load tweet…

 

కేంద్రంతో కలిసే అభివృద్ధి సాధ్యం:

ఒక్క రాష్ట్ర‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాద‌ని, అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి అని సీఎం రేవంత్‌ అన్నారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా, అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగిస్తానన్నారు. చక్కెర పరిశ్రమ ఏర్పాటు కోసం సహకార సంఘం ఏర్పడితే, నిమ్జ్‌లో 100 ఎకరాలు కేటాయించి, నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.