కేసీఆర్‌కి కవిత రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో బీఆర్ఎస్ సభ పాజిటివ్,నెగటివ్ ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు.

డాడీ బీజేపీ మీద ఇంకా కొంచెం గట్టిగా ఫోకస్‌ పెట్టి ఉండే బాగుండేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..కేసీఆర్‌కి ఓ సుదీర్ఘమైన లేఖను రాశారు.ప్రస్తుతం ఆ లేఖ సోషల్‌ మీడియాలో షికారు చేస్తుంది.కానీ ఇప్పటి వరకు అటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కానీ, కవిత కార్యాలయం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు.ఆ లేఖలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సక్సెస్‌ అయినందుకు అభినందనలు చెప్పారు. అంతేకాకుండా అందులో కొన్ని పాజిటివ్‌,నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆమె శుక్రవారం నగరానికి రానున్నట్లు తెలుస్తుంది.

కవిత రాసిన లేఖలో పాజిటివ్ ఫీడ్‌ బ్యాక్‌ ఈ విధంగా ఉంది. డాడీ..బీఆర్‌ఎస్‌ రజోత్సవ సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు అభిమానులు అంతా కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు.అంతేకాకుండా మీరు‘ఆపరేషన్‌ కగార్‌’పై మాట్లాడడం చాలామందికి నచ్చింది. అంతేకాకుండా..కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యిందనే విషయాన్ని స్వయంగా పార్టీ శ్రేణులతో మీరు చెప్పించడం చాలా బాగుందని పార్టీ కార్యకర్తలతో పాటు తెలంగాణలోని ప్రతి బీఆర్‌ఎస్‌ అభిమాని అనుకుంటున్నారు.

సభలో పహల్గాం దాడిలో చనిపోయిన వారికి నివాళిగా మౌనం పాటించడం కూడాబాగుంది. వ్యక్తిగతంగా రేవంత్‌ పేరును ఎక్కడ ప్రస్తావించకుండా ఉండడంతో పాటు ఆయన మీద వ్యక్తిగత దూషణకు కూడా దిగకపోవడం కూడా మీ వ్యక్తిత్వ హుందాతనానికి ప్రతీకగా నిలిచింది.ఆయన మిమ్మల్ని రోజూ విమర్శిస్తున్నప్పటికీ... మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది.

తెలంగాణ అంటే బీఆర్‌ఎస్‌.. తెలంగాణ అంటే కేసీఆర్‌ అని మీరు బలంగా చెబుతారని ఎందరో చెప్పారు. చాలా మంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం గురించి మీరు సభలో ప్రసగించి ఉంటే బాగుండేది. ఇదిలా ఉంటే చాలా మంది మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్‌ని అయితే ఆశించారు. అయినా కార్యకర్తలు, నాయకులు సభతో సంతృప్తిగా ఉన్నారు. పోలీసులకు మీరు ఇచ్చిన వార్నింగ్‌ కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్లింది.

ఇక నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ విషయానికి వస్తే...సభ మొత్తంలో మీరు ఒక్కసారి కూడా ఉర్దూలో మాట్లాడలేదు.వక్ఫ్‌ బిల్లుపై ప్రస్తావించలేదు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని గురించి విస్మరించారు.అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం గురించి కూడా మాట్లాడకపోవడం,ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత ఇన్‌ఛార్జులకు ఇవ్వడంతో.. వాళ్లు పాత పద్ధతిలో.. తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్‌బ్యాక్‌ కొన్ని నియోజకవర్గాల్లో మా దృష్టికి వచ్చింది.

మళ్లీ పాత ఇన్‌ఛార్జులకే.. స్థానిక సంస్థల ఎన్నికల బీ-ఫాంల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్‌ఛార్జులు చెప్పుకొంటున్నారంట.స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునేవారు రిలాక్స్‌గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీగా ఉండాలనుకునేవాళ్లు... ఇన్‌ఛార్జుల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీ-ఫాంలు ఇవ్వాలని అడుగుతున్నారు.మీరు సభా వేదిక మీదకు వచ్చేలోపు... 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలామంది అన్నారు.

ఆకట్టుకోవడంలో ఫెయిలైంది..

కార్యకర్తలను ‘ధూం ధాం’.. ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.బీజేపీ గురించి మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో.. చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా స్ట్రాంగ్‌ గా మాట్లాడి ఉంటే బాగుండేది. నేను బాధను అనుభవించాను కదా! అందుకని అయ్యి ఉండొచ్చు. మీరు బీజేపీని ఇంకొంచెం టార్గెట్‌ చేయాల్సిందేమో డాడీ.

కాంగ్రెస్‌పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. దానికి భాజపా ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికలో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను, మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ భావించారు.కనీసం ఇప్పుడైనా.. మనం ఒకటి రెండు రోజులు ప్లీనరీ నిర్వహించండి. ఈ విషయంపై కొంచెం సీరియస్‌గా ఆలోచన చేయండి.

చాలామంది మీతో ఫొటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే.. చాలా హార్ట్‌ వార్మింగ్‌గా అనిపించింది.జడ్పీటీసీ సభ్యులుగా, జడ్పీ ఛైర్మన్‌లుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు చాలామంది.. మిమ్మల్ని కలవడానికి అవకాశం లభించడం లేదని బాధపడుతున్నారు. పరిమితంగా, కొద్దిమందికే కలిసే అవకాశం వస్తోందని భావిస్తున్నారు. దయచేసి అందర్నీ కలవండి.ఇంత పెద్ద సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ! ధన్యవాదాలు’’ అని కవిత లేఖలో రాసుకొచ్చారు.