సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, లోకాయుక్త, కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధం ఉన్న ఓ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే 'బహుమతి'గా ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ లావాదేవీపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టెసరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీకి కొండల్ రెడ్డికి సంబంధం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఆ కంపెనీ వార్షిక రిపోర్ట్ ప్రకారం… దాని పెయిడ్-అప్ క్యాపిటల్ కేవలం లక్ష రూపాయలేనని, ఒక్క ఉద్యోగి కూడా లేరని ఆయన తెలిపారు. అలాంటి కంపెనీకి 200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

"రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, టెసరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీని సృష్టించారు. దాని పెయిడ్-అప్ క్యాపిటల్ లక్ష రూపాయలు. వార్షిక రిపోర్ట్ ప్రకారం ఒక్క ఉద్యోగి కూడా లేడు. అలాంటి కంపెనీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే బహుమతిగా ఇచ్చింది" అని కేటీఆర్ అన్నారు.

సీఎం సోదరుడికి, ఆ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం చెప్పిందని కేటీఆర్ ఆరోపించారు. కానీ కొండల్ రెడ్డి తనను తాను టెసరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఛైర్మన్‌గా చెప్పుకున్నారని, యూఎస్ కాన్సుల్ జనరల్‌తో జరిగిన సమావేశాల్లో కూడా పాల్గొన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. "ఒకవైపు ఏ సంబంధం లేదంటారు, మరోవైపు ఆయనేమో తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఆ కంపెనీకి ఛైర్మన్‌ అని పోస్ట్ చేసుకుంటారు. నిజం బయటకు రావాలి. రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పాలని మేము కోరుతున్నాం" అని ఆయన అన్నారు.

రేపు ఇంకో స్టార్టప్ లక్ష రూపాయల ఈక్విటీతో కంపెనీ పెడితే, వాళ్లకు కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా 200-300 కోట్ల విలువైన భూమి ఇస్తారా? లేక మీ సోదరులకు వేరే చట్టాలు, నిబంధనలు ఉన్నాయా? మీరు సమాధానం చెప్పాల్సిందే" అని కేటీఆర్ ప్రశ్నించారు.

చట్టపరంగా తేల్చుకుంటామన్న బీఆర్ఎస్

రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే ఆయన సోదరులు, బావమరిది తెలంగాణలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్నారని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్, లోకాయుక్త, ఇతర సంస్థలతో పాటు కోర్టులను కూడా ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

"కర్ణాటకలో సిద్దరామయ్య రాజీనామా చేసేంత వరకు వెళ్లిన MUDA స్కామ్ కంటే ఇది పెద్ద స్కామ్. దీన్ని మేము వదిలిపెట్టం. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టుపైనా ప్రశ్నలు

హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదిత పీఎం ఏక్తా (యూనిటీ) మాల్ టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దాన్ని రద్దు చేసి స్వతంత్ర విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేసిన ఒక రోజు తర్వాత ఈ ఆరోపణలు రావడం గమనార్హం.

భూమి విలువ కాకుండానే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,059.81 కోట్లు అని, ఇందులో 6.30 ఎకరాల విలువైన భూమి, సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఒక ప్రైవేట్ డెవలపర్‌కు వాణిజ్య స్థలాన్ని కేటాయించడాన్ని, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ. 200 కోట్ల వడ్డీ లేని కేంద్ర రుణాన్ని మళ్లించడాన్ని ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదల నిలిపివేయాలని, భూమి విలువ, ఫైనాన్షియల్ మోడల్, టెండర్ షరతులు, బిడ్ మూల్యాంకనం, వాణిజ్య హక్కుల కేటాయింపుపై స్వతంత్ర విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేటీఆర్ కోరారు.

బీజేపీ మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్

తెలంగాణలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. "మేము బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాం. వీటన్నింటిపై ఏడాది క్రితమే ఫిర్యాదు చేశాం, ఇప్పటి వరకు మీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ ఎలాంటి అవగాహన ఉంది? మీరు కూడా స్పష్టం చేయాలి" అని ఆయన అన్నారు.