తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక వ్య‌క్తికి కులం కాద‌ని, అత‌ని చ‌దువే గొప్ప‌త‌నం తీసుకొస్తుంద‌ని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అంబేడ్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగం చూపిన మార్గానుసారమే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి” అని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలంటే చదువే ప్రధాన ఆయుధమని రేవంత్ స్పష్టం చేశారు. “కులం కాదు, విద్యే గొప్పతనం తీసుకొస్తుంది. ఎదుగుదల కోసం విద్యే మార్గం. సమాజంలో అసమానతలు, విభేదాలు తొలగించాల్సిన అవసరం ఎంతో ఉంది,” అని ఆయన చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో కార్పొరేట్ స్థాయిలో విద్య

కోఠిలోని మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును పెట్టడం ద్వారా సామాజిక నాయకుల సేవలకు గౌరవం చెల్లిస్తున్నట్టు సీఎం వివరించారు. కార్పొరేట్ స్థాయిలో పోటీ చేయగలిగే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా, చక్కగా చదువుకోవాలంటే పర్యావరణం, మౌలిక సదుపాయాలు మెరుగుగా ఉండాలని అన్నారు.

మాజీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. “గత పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు చదువు అవసరం లేదనుకొని, కేవలం కులవృత్తులకే పరిమితం చేశారు. దళితులను గొర్రెలు, బర్రెలు, చేపల పెంపకం లాంటి వృత్తులకే ప‌రిమితం చేశారు” అని ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీ

గత ప్రభుత్వ హయాంలో యువత ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది అని చెప్పారు.

“మాజీ సీఎం తన ఇంటి వారికి ఉద్యోగాలు కల్పించి, పదవులు ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రజల కోసం పట్టించుకోలేదు,” అని విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన‌ 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు సీఎం తెలిపారు. ఇంకా లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం గుర్తుచేశారు.

అడ్డంకులను ప్రజలు ప్రశ్నించాలి

ఉద్యోగాల నియామకం ఆలస్యమవుతున్న దానికి కొన్ని కుట్రలే కారణమని, వాటిని ప్రజలు ఎదిరించాలని సీఎం పిలుపునిచ్చారు. “కొంతమంది ఉద్దేశపూర్వకంగా నియామక ప్రక్రియను నిలిపివేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజలు అలా చేసే వారిని ప్రశ్నించాలి,” అని చెప్పారు.