అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో యావత్ దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలుగు విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు అమెరికా వెళ్లి మాస్టర్స్ చేస్తుంటారు. అయితే తాజాగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (US Embassy India) ఇచ్చిన హెచ్చరిక ఈ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా కొంతమంది తమ ప్లాన్లు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా ఎంబసీ తమ అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. విద్యార్థులు క్లాసులకు హాజరుకాకపోవడం, కోర్సును మధ్యలో మానేయడం, లేక విద్యాసంస్థకు తెలియజేయకుండా అమెరికా వదిలి వెళ్లడం వంటి చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది.
ఇలాంటి సందర్భాల్లో విద్యార్థుల F1 వీసాలు రద్దు చేస్తామని, భవిష్యత్తులో మరోసారి అమెరికా వీసా కోసం అర్హత కోల్పోవచ్చని హెచ్చరించింది. "మీ వీసా నిబంధనలకు కట్టుబడి ఉండండి. విద్యార్థి హోదా కాపాడుకోండి" అని సూచించింది.
ఈ హెచ్చరికలతో పాటు ట్రంప్ పాలనలో విద్యార్థులు, వలసదారులపై మారుతున్న విధానాలను పరిశీలించిన తరువాత.. తెలుగు విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, యూకే వంటి దేశాల్లో మాస్టర్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది అయితే అమెరికా కంటే యూరప్ దేశాలు బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నాయి.
ఐఎల్ఈటీఎస్ (IELTS) ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి అమెరికా కాకుండా ఇతర దేశాలే మంచివనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపాడు. మరో విద్యార్థి స్పందిస్తూ తాను నేరుగా ఆస్ట్రేలియా కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. పరిస్థితులు చూస్తుంటే విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ చర్యలు కూడా విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉండే వ్యక్తులకు వలస శాఖ (DHS) ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. "CBP హోమ్ యాప్" ద్వారా స్వయంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లే వారికి $1,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదీగాకుండా ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. "అక్రమంగా ఉన్నవారు తమ స్వదేశానికి వెళ్లడానికి సహకరించాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నాం" అని అమెరికా ప్రభుత్వం తెలిపింది.