కవితతో కొత్తపార్టీ పెట్టిస్తున్నదే కేసీఆరా..? ఇంతకూ ఆయన కొడుకుసైడా, కూతురుసైడా?
కల్వకుంట్ల కవిత వ్యవహరతీరును చూస్తుంటే బిఆర్ఎస్ కు దూరమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆమె కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కేసీఆర్ ఎవరివైపుంటారు… కూతురు వైపాా, కొడుకా వైపా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
కేసీఆర్ ప్రేమే బిడ్డలను దూరం చేసిందా?
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ చివరకు స్వరాష్ట్రాన్ని సాధించి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారు. ఈ సమయంలోనే తన ఇద్దరు బిడ్డలకు కీలక పదవులు ఇచ్చుకున్నారు. కొడుకు కేటీఆర్ ను మంత్రిని చేయగా, కూతురు కవితను ఓసారి ఎంపీ, మరోసారి ఎమ్మెల్సీని చేసారు. ఇలా బిడ్డల రాజకీయ భవిష్యత్ కోసం ఓ తండ్రిగా కేసీఆర్ తాపత్రయపడ్డారు. కానీ అప్పుడు ఆ తండ్రి ప్రేమతో చేసిన పనే ఇప్పుడు అన్నాచెల్లి మధ్య విబేధాలను సృష్టిస్తోందా? అంటే రాజకీయవర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
కవిత కొత్తపార్టీ పెడతారా?
ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన ఓ లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖలో ఆమె బిఆర్ఎస్ పార్టీ వ్యవహారతీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ లేఖతోనే తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.. ఇక తాను రాసిన లేఖ బయటకురావడంపై కవిత చేసిన కామెంట్స్ మరింత హీటెక్కించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత బిఆర్ఎస్ ను వీడతారని... సొంతంగా కొత్తపార్టీ పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
కవిత లెటర్ పై బిజెపి ఎంపీ ఆసక్తికర కామెంట్స్
తాజాగా బిజెపి ఎంపీ రఘునందర్ రావు ఈ కవిత లెటర్ వ్యవహారంపై స్పందించారు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమేనని.. ఆయనే కూతురితో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. జూన్ 2న అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజునే కవిత కొత్తపార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు. తర్వాత వైఎస్ షర్మిల లాగే కవిత కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని రఘునందన్ రావు అన్నారు.
ఇలా ఓవైపు కేటీఆర్ కు పూర్తిగా బిఆర్ఎస్ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు కూతురి రాజకీయ భవిష్యత్ ను సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారని రఘునందర్ రావు మాటలను బట్టి అర్థమవుతోంది. దీనివల్ల అటు కేటీఆర్, ఇటు కవిత ఇద్దరికీ లాభమే. ఎలాగంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొందరు బిఆర్ఎస్ నాయకులు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారట... ఇలాంటివారు కాంగ్రెస్, బిజెపిలో చేరకుండా కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లానే కూతురితో పార్టీ పెట్టించడం అని రఘునందన్ తెలిపారు. ఇలా కేసీఆర్ బిఆర్ఎస్ ను వీడేవారిని తన కూతురు పెట్టే కొత్తపార్టీలోకి పంపిస్తాడని అన్నారు
కేసీఆర్ కొడుకువైపా? కూతురువైపా?
ఇలా కేసీఆర్ ఇటు కొడుకుకు అప్పగించిన పార్టీ బిఆర్ఎస్, అటు కూతురితో పెట్టించే కొత్తపార్టీకి లాభం చేసేలా వ్యవహరిస్తారన్నది రఘునందన్ వాదన. ఈ రెండిట్లో ఏ పార్టీ గెలిచినా అధికారం తన ఇంట్లోనే ఉంటుందని... సీఎం అయ్యేది కల్వకుంట్ల ఇంటి బిడ్డలేనని కేసీఆర్ భావిస్తున్నట్లు బిజెపి ఎంపీ మాటలు చెబుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పటికే దూరంగా ఉంటున్న కేసీఆర్ తెరవెనకుండి తన బిడ్డల రాజకీయ భవిష్యత్ కోసం పనిచేయనున్నారన్నమాట. అంటే కేసీఆర్ తన కొడుకు కేటీఆర్, కూతురు కవిత ఇద్దరివైపు ఉన్నట్లే.
కవిత కాంగ్రెస్ వైపు చూస్తుందా..?
మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి మెళ్లిగా దూరమవుతున్న కవిత కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లోని ముఖ్య నేతల ద్వారా ఇప్పటికే కవిత ప్రయత్నాలు చేస్తున్నారని... ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి చెంతకు కూడా చేరిందని తెలుస్తోంది. ఇటీవల డిల్లీ పర్యటనలో సీఎంతో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అదిష్టానంతో కవిత కాంగ్రెస్ చేరాలనుకుంటున్న ప్రతిపాదనపై చర్చించినట్లు సమాచారం. అంతా సజావుగా సాగిపోతే కవిత కాంగ్రెస్ లో చేరతారని... జూన్ 2న దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ మరో ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత బిఆర్ఎస్ లోనే కొనసాగుతారా? సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? కాంగ్రెస్ లో చేరి తండ్రి, సోదరుడికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.