సారాంశం

రెండు రోజులుగా  తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ పై ఆయన  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు  కట్టుబడి ఉన్నట్టుగా   కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా చెప్పారు. శనివారంనాడు హైద్రాబాద్ సోమాజీగూడలో కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ఆలోచనలు ఒక్కటేనన్నారు.ప్రధాన మంత్రి ఆదేశాలతో  ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేసేందుకు  కమిటీని ఏర్పాటు చేశామని  అమిత్ షా చెప్పారు. 

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన  అభిప్రాయపడ్డారు. తెలంగాణ కు ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు.యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు తెలంగాణలో చాలా అసంతృప్తిగా ఉన్నారని  అమిత్ షా చెప్పారు.ఈ నెల  30న జరిగే పోలింగ్ లో భారతీయ జనతా పార్టీకి బంపర్ మెజారిటీని ఇవ్వాలని ఆయన కోరారు.  చైతన్యవంతమైన తెలంగాణ ఓటర్లు బీజేపీకి, మోదీకి అండగా ఉంటారని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అమిత్ షా  చెప్పారు.

also read:Telangana assembly Elections 2023: ఓటరు గుర్తింపు కార్డు లేదా... ఈ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా ఆరోపించారు. మియాపూర్ భూకుంభకోణం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు టోల్,మధ్యం కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం వంటివాటిలో కేసీఆర్ ప్రభుత్వం కూరుకుపోయిందని అమిత్ షా ఆరోపించారు.

నిరుద్యోగులకు  ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని భారత రాష్ట్ర సమితి సర్కార్ అమలు చేయలేదని  అమిత్ షా విమర్శించారు.  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం  నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలు  లీకయ్యాయని ఆయన చెప్పారు. టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ వెనుక  కుంభకోణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 3 వేల నిరుద్యోగ భృతిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

also read:Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి

డబుల్ బెడ్ రూమ్, దళితబంధు పథకాల్లో బీఆర్ఎస్ శ్రేణులు చేతివాటం ప్రదర్శించారని  అమిత్ షా ఆరోపించారు. ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి హామీలన్నీ ఉత్తుత్తివే అని తేలిపోయిందని ఆయన  ఎద్దేవా చేశారు. సిటీలు ఎక్కడా కనిపించవు... సిటీ  పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు,  భూములను కబ్జా చేసుకుందని అమిత్ షా చెప్పారు.కాంగ్రెస్ కు ఓటేస్తే  బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.

రామమందిరం, ట్రిపుల్ తలాక్ , ఆర్టికల్ 370  వంటి అంశాల్లో  ప్రజలకు ఇచ్చిన హామీలను  బీజేపీ సర్కార్ అమలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.  కేసీఆర్  ప్రభుత్వాన్ని గద్దెదించుతామన్నారు. వరికి క్వింటాలుకు రూ.3,100 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

also read:amit shah:కేసీఆర్ అవినీతిపై విచారించి జైలుకు పంపుతాం

మోడీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలావరకు ధరలు తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాయన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు నామమాత్రంగా  పన్నులను తగ్గించాయన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ వ్యాట్ తగ్గించని విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో  తమ పార్టీ అధికారంలోకి రాగానే వ్యాట్ తగ్గిస్తామని అమిత్ షా హమీ ఇచ్చారు. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ దర్శనం చేయిస్తామని  అమిత్ షా చెప్పారు.  పీవీ నరసింహారావు, టి.అంజయ్య లను కాంగ్రెస్ పార్టీ  అవమానించిందని ఆయన విమర్శించారు.