కోహ్లీకి ప్రతిష్టాత్మక అవార్డు: రిషబ్ పంత్ కోచ్ కూ....
భారత ప్రభుత్వ కేంద్ర క్రీడాశాఖ యేటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును సిఫార్సు చేశారు. సిరీస్ కోల్పోయినప్పటికీ విరాట్ ఇంగ్లాండ్ సిరీస్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ కేంద్ర క్రీడాశాఖ యేటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును సిఫార్సు చేశారు. సిరీస్ కోల్పోయినప్పటికీ విరాట్ ఇంగ్లాండ్ సిరీస్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టెస్ట్ సిరీస్లో మూడు అర్థ సెంచరీలు, రెండు సెంచరీలు చేశాడు. కోహ్లీ 68.00 బ్యాటింగ్ యావరేజ్తో 544 పరుగులు చేశాడు.
కాగా, విరాట్ కోహ్లీతో పాటు ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను పేరును కూడా సిఫార్సు చేశారు. ఈ ఏడాది ఆదిలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మీరాభాయ్ 48 కిలోల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అంతకు ముందు జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కూడా మీరా భాయ్ 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకం సాధించింది. అయితే ఈ సిఫార్సులను కేంద్ర క్రీడాశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఇదిలావుంటే, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోచ్ తారక్ సిన్హా పేరును ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేశారు. టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా, ఓపెనర్ శిఖర్ ధావన్ వంటివారిని ఆయన తీర్చి దిద్దారు. ఆయనతోపాటు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తండ్రి, కోచ్ అయిన ఆచంట శ్రీనివాసరావు పేరును కూడా ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేశారు.
మహిళల జాతీయ జట్టుకు కూడా సిన్హా కోచ్గా వ్యవహరించారు. ఆయన కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఏడాదే మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆచంట శ్రీనివాస రావు కుమారుడు శరత్ కమల్ ఎనిమిదిసార్లు కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్ అందుకున్నాడు. ఆసియా గేమ్స్లో రెండుసార్లు కాంస్య పతకాలు గెలిచాడు.
కుమారుడు శరత్ కమల్ సహా ఎందరినో టేబుల్ టెన్నిస్ క్రీడాకారులుగా శ్రీనివాసరావు తీర్చి దిద్దారు. సిన్హా, శ్రీనివాసరావుతోపాటు పాటు క్లారెన్స్ లోబో (హాకీ), విజయ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), జీవన్ శర్మ (జూడో), సీఏ కుట్టప్ప (బాక్సింగ్) తదితరుల పేర్లు కూడా ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేశారు.