ప్రో కబడ్డి 2019: నవీన్ పాయింట్ల మోత... పుణేరీ పల్టాన్ పై హర్యానా స్టీలర్స్ విజయం
ప్రో కబడ్డి 2019 లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో పుణేరీ పల్టాన్, హర్యానా స్టీలర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ హర్యానా జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది.
గచ్చిబౌలి వేదికన జరిగిన రెండో మ్యాచ్ లో పుణేరీ పల్టాన్ పై హర్యానా స్టీలర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ముఖ్యంగా హర్యానా రైడర్ నవీన్ కూతకు పాయింట్ల మోత మోగింది. అతడొక్కడే ఏకంగా 14 పాయింట్లు సాధించి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో పుణేపై హర్యానా 10 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో హర్యానా మొత్తం 34 పాయింట్లు సాధించగా అందులో 14 పాయింట్స్ రైడర్ నవీన్ ఒక్కడే అందించాడు. హర్యానాకు రైడింగ్ లో 15 పాయింట్స్ లభించగా, సూపర్ రైడ్ 1, ట్యాకిల్స్ 14, ఆలౌట్ 4, ఎక్స్ ట్రా రూపంలో 1 పాయింట్స్ లభించాయి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే నవీస్ 14పాయింట్స్(12 రైడ్, 2 ట్యాకిల్), ప్రవీణ్ 4, వికాస్ 4, సెల్వమణి 3, కుల్దీప్ సింగ్ 3,ధర్మరాజ్ 1 పాయింట్స్ సాధించారు.
ఇక పుణేరీ పల్టాన్ కు 14 రైడింగ్, 10 ట్యాకిల్ రూపంలో మొత్తం 24 పాయింట్లు లభించాయి. ఆటగాళ్లలో పవన్ కుమార్ 10 పాయింట్లతో అదరగొట్టినా మిగతా ఆటగాళ్లేవరూ ఆకట్టుకోలేకపోయారు. మంజిత్ 5, శుభమ్ 3, జాదవ్ 3, అమిత్ 2, గిరిశ్ 1 పాయింట్ సాధించారు. ఇలా పుణేరీ పల్టాన్ 24-34 తేడాతో హర్యానా చేతిలో ఓటమిపాలయ్యింది.