కోహ్లీపై పాక్ క్రికెటర్ కామెంట్.. తిప్పికొట్టిన గంభీర్
పాకిస్థాన్ అంటే ఉన్న భయం కారణంగానే ఆసియా కప్ నుంచి కోహ్లీ పారిపోయాడని తన్వీర్ వ్యాఖ్యానించాడు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాక్ క్రికెటర్ ఒకరు కామెంట్ చేయగా.. గంభీర్ అతనికి ఘాటు రిప్లై ఇచ్చారు. కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ నుంచి వైదొలిగి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఆడకుండా కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంపై స్పందిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ అంటే ఉన్న భయం కారణంగానే ఆసియా కప్ నుంచి కోహ్లీ పారిపోయాడని తన్వీర్ వ్యాఖ్యానించాడు.
`ఆసియా కప్లో పాకిస్థాన్తో ఫైనల్స్తో సహా భారత్ మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇది ముందే ఊహించి కోహ్లీ ఆసియా కప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. పాకిస్థాన్ జట్టుతో ఆడడానికి కోహ్లీ భయపడి ఉంటాడు. ఇంగ్లండ్తో అన్ని మ్యాచ్లూ ఆడినవాడు ఆసియా కప్ నుంచి ఎందుకు నిష్క్రమించాడు` అని తన్వీర్ విమర్శించాడు.
తన్వీర్ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. `విరాట్ కోహ్లీ ఇప్పటికే 35-36 సెంచరీలు చేశాడు. అలాంటి అటగాడికి మరో సెంచరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, తన్వీర్ అనే ఆటగాడు కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఆడలేకపోయాడు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది` అని గంభీర్ రిప్లై ఇచ్చాడు.
గంభీర్ ఇచ్చిన రిప్లైకి క్రికెట్ ప్రేమికులు, కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సరైన రిప్లై ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
read more news
క్రికెట్ వదిలేసి.. సినిమాల్లోకి కోహ్లీ..?