మొదలైన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
- మూడు రోజుల ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభం
- భాజపాపై దాడులు, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతంపై తీర్మానాలు
- మోహన్ భగవత్, అమిత్ షా, ప్రవీణ్ తొగాడియా తదితరులు హజరు
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీపై జరుగుతున్న దాడులు, దేశ ఆర్ధిక వ్యవస్ధపై చర్చించే లక్ష్యంతో మూడు రోజుల రాష్ట్రీయ స్వయం సంఘ (ఆర్ ఎస్ ఎస్) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ రాష్ట్రంలో భాజపాపై దాడులు పెరిగిపోతుండటం పట్ల ఆర్ఎసఎస్ ఆందోళన చెందుతున్నది.
కేరళలో భాజపాకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలపై సిపిఎం వర్గాలు దాడులు చేస్తున్న విషయాన్ని సమావేశం చర్చించింది. భవిష్యత్తులో ఇతర పార్టీల నుండి దాడులను ఎదుర్కొనాలంటే అవలంభించాల్సిన విధానంపై కూడా సమావేశం చర్చిస్తోంది. ఇదే విషయమై సమావేం ఒక తీర్మానం కూడా చేయనున్నది.
అదేవిధంగా దేశ ఆర్ధిక వ్యవస్ధపై కూడా చర్చ జరుగుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలంటే అఖిల భారత జన్ సంఘ్ వ్యవస్ధాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన సిద్ధాంతాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావాలంటే ఉపాధ్యాయ చెప్పిన విధానాల అనుసరించటమే మార్గమని కూడా సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఒక తీర్మానం ఉంటుంది.
ప్రతీ ఏడాది ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగటంలో భాగంగానే మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఘట్ కేశర్ లో ఆదివారం ప్రారంభమైన సమావేశాల్లో ఆర్ ఎస్ ఎస్ జాతీయ ఛీఫ్ మోహన్ భగవత్, అఖిల భారత ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తదితరులు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొననున్నారు. విశ్వహిందు పరిషత్ పరిషత్ జాతీయ అధ్యక్షడు ప్రవీణ్ తొగాడియాతో పాటు విహెచ్ పి ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ప్రతీ ఏడాది మార్చిలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అదే విధంగా జూలైలో వర్కింగ్ కమిటి సమావేశం, అక్టోబర్ లో కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఇపుడు జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో దేశం నలుమూలల నుండి సుమారు 400 మంది హాజరయ్యారు. ప్రతీ రాష్ట్రం నుండి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు, కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి స్ధాయి నేతలతో పాటు అఖిల భారత ఆర్ఎస్ఎస్ కార్యవర్గ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.