పాకిస్థాన్‌ గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాపై విచారణ కొనసాగుతుండగా, ఉగ్రవాదులతో సంబంధాలపై ఆధారాలేవీ లేవని హిస్సార్‌ పోలీసులు తెలిపారు.

భారత్‌ కి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ కి చేరవేస్తుందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా పై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలోనే బుధవారం ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంప్రదింపులు మాత్రం జరిపినట్లు అంగీకరించిందని హరియాణా పోలీసులు తెలిపారు.

ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ…

అయితే, ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. అంతేగాక, సాయుధ దళాల గురించి కూడా ఆమెకు ఎలాంటి అవగాహన ఉన్నట్లు కనిపించలేదని హిస్సార్‌ ఎస్పీ చెప్పుకొచ్చారు.‘‘ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లో కూడా ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవు.

ఇక, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గానీ నిర్ధరించే పత్రాలేవీ మాకు దొరకలేదు. అయితే, ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్‌ గూఢచర్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ.. జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారు. ఇక, మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అన్పించడం లేదని ఎస్పీ చెప్పుకొచ్చారు.