పాక్ ఇంటెలిజెన్స్‌ అధికారితో సంబంధాలు కలిగి గూఢచర్యం చేసినట్లు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంగీకారించింది.

భారత్‌ కి చెందిన కీలక విషయాలను పాక్‌ కి గూఢచర్యం చేసిన నేపథ్యంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్ర ను అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జ్యోతి 2023లో పాక్ హైకమిషన్‌కు వీసా కోసం వెళ్లినప్పుడు అక్కడ పని చేస్తున్న డానిష్ అనే అధికారితో పరిచయమయ్యింది. అది వారి మధ్య సన్నిహిత్యానికి దారి తీసింది.

ఇక అప్పటి నుంచి అతనితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేదని అధికారుల విచారణలో తెలిసింది. అంతేకాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన ఓ కీలక ఆపరేషన్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కేంద్రం పలు రాష్ట్రాల్లో బ్లాకౌట్లు ప్రకటించింది. ఈ గోప్యమైన సమాచారం కూడా ఆమె డానిష్‌కు తెలియజేసినట్లు దర్యాప్తు బృందానికి సమాచారం లభించింది.

ఇందులో భాగంగా పోలీసులు ఆమె నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమెకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నేటితో ఆమె పోలీస్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, హిస్సార్ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు.

ఇదిలా ఉండగా, జ్యోతి మల్హోత్రా రాసిన డైరీ, ఆమె దగ్గర లభించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ డైరీలో పాక్‌పై ఆమెకు ఉన్న ఆకర్షణ స్పష్టంగా కనపడుతోంది. ఆ దేశ ప్రజల ముద్ర, సంస్కృతి తనను ఆకట్టుకుందనీ, పాక్ ఎంతో కలర్‌ఫుల్‌గా అనిపించిందని ఆమె రాసుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది.

‘హ్యాపీనెస్’ అనే పేరుతో...

జ్యోతిని ట్రాప్ చేసిన డానిష్ పేరు ఇప్పటికే మరొక గూఢచర్య ఘటనలో కూడా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌కు చెందిన గజాల అనే యువతిని కూడా ఇదే డానిష్ వీసా అవసరంతో పాక్ హైకమిషన్‌కు వచ్చిన క్రమంలోనే పరిచయం అయ్యాడు. ఆ పరిచయం హనీట్రాప్‌గా మారి, ఆమె నుంచి సైనిక స్థావరాల సమాచారం సేకరించే వరకు చేరుకుంది. డానిష్ తన ఫోన్ నెంబర్‌ను ‘హ్యాపీనెస్’ అనే పేరుతో గజాల ఫోన్‌లో సేవ్ చేయించినట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది.

పాక్ హైకమిషన్‌లో వీసా కోసం వచ్చే భారతీయులను టార్గెట్ చేసి వారిని మోసపూరితంగా గూఢచర్యంలోకి దించే పథకం నడుస్తోందని అధికారులు అనుకుంటున్నారు. యూట్యూబర్ జ్యోతి కూడా ఇదే పద్ధతిలో డానిష్ వలలో చిక్కినట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఆమెపై గూఢచర్యం, దేశ భద్రతాకు విఘాతం కలిగించడంపై కేసులు నమోదు అయ్యాయి. అధికార వర్గాలు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టింది.