పాకిస్తాన్ పర్యటన తర్వాత అరెస్టైన యూట్యూబర్ జ్యోతి డైరీలో కీలక విషయాలు బయటపడ్డాయి. గూఢచర్య ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ పర్యటన నేపథ్యంలో తీవ్ర విమర్శలతో పాటు గూఢచర్య ఆరోపణల మధ్య వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ఏంటంటే..ఆమె వాడిన డైరీపై దృష్టి సారించడంతో మొదలైంది.
జ్యోతి దేశ విదేశాలకి ప్రయాణించే ప్రతీసారి తన అనుభవాలను డైరీలో నమోదు చేసుకునేదని తెలుస్తుంది. అందుకే ఆమె పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన సమాచారం డైరీలో ఉండవచ్చన్న అనుమానంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల ప్రాథమిక పరిశీలనలో ఆ డైరీలో పాకిస్తాన్ ప్రజల ఆతిథ్యం, అక్కడి జీవనశైలి, మతపరమైన ప్రదేశాల వర్ణనలతో పాటు ఆమె వ్యక్తిగత భావోద్వేగాలు ఉన్నట్లు గుర్తించారు. జ్యోతి తన భావాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యక్తీకరించినట్టు సమాచారం. ముఖ్యంగా పాక్ పర్యటన అనంతరం ఆమె ఎక్కువగా హిందీలోనే రాసిందని తెలిపారు.
అలాంటి కుటుంబాలు మళ్లీ కలవాలి..
ఆమె డైరీలో విభజన సమయంలో విడిపోయిన కుటుంబాల కథలు కూడా ఉన్నాయి. అలాంటి కుటుంబాలు మళ్లీ కలవాలని, భిన్న దేశాలలో ఉన్నా మనసులు కలవాలని ఆమె అభిలాష వ్యక్తమైంది. సరిహద్దులు శాశ్వతమైనవేమో తెలీదు కానీ ప్రజల మధ్య బంధాలు పటిష్టంగా ఉండాలనే అభిప్రాయం ఆమె రాతల్లో ఉందని పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం ఆ డైరీలోని విషయాలు నేరపరంగా ఎంత వరకూ ఆధారంగా నిలుస్తాయన్నదే ప్రధాన చర్చగా మారింది. కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ డైరీలోని సమాచారం కీలకంగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంపై అధికార వర్గాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. తుది నివేదిక వచ్చేంతవరకూ ఆమె పాక్ పర్యటనపై అనేక అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి.