బంగారం పోయిన బాధను తట్టుకోలేక తల్లి కుమారుడితో కలిసి దూకిన ఘటన వనస్థలిపురంలో కలకలం రేపింది. తల్లి మృతి చెందగా, చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.
హైదరాబాద్ నగరంలో వనస్థలిపురం ప్రాంతం ఓ విషాద ఘటన జరిగింది. చింతల్కుంట ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల సుధేష్ణ అనే మహిళ తన రెండున్నరేళ్ల కుమారుడితో కలిసి ఆగమయ్య నగర్లోని తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
ఏడు తులాల బంగారు ఆభరణాలు..
పోలీసుల కథనం ప్రకారం, సుధేష్ణ వివాహం నాలుగేళ్ల క్రితం నోముల ఆశీష్ కుమార్ అనే యువకుడితో జరిగింది. వీరిద్దరికీ ఆరుష్ కుమార్ అనే చిన్నారి ఉంది. ఈ నెల 16న సుధేష్ణ నాచారం ప్రాంతంలో జరిగిన ఓ కుటుంబ వేడుకకు హాజరైంది. అక్కడ ఆమెకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. వాటి కోసం ఆమె ఎంతగా వెదికిన ఆ ఆభరణాలు దొరకకపోవడం, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవడం వల్ల ఆమె తీవ్రమైన ఆవేదన చెందింది.
దీంతో, మంగళవారం ఉదయం ఆమె తన నివాసంలోని మూడో అంతస్తు నుంచి కుమారుడితో కలిసి కిందకు దూకింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుధేష్ణ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి ఆరుష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.
పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం చోరీ జరిగిన స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు.