హైదరాబాద్ అగ్నిప్రమాదం విషాదం పై మిస్ కెనడా స్పందన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ వద్ద చోటుచేసుకున్న అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా, ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీ నివాసం ఉంటున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆయన కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలు పేలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ హృదయవిదారక ఘటనపై మిస్ కెనడా ఎమ్మా మారిసన్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. ప్రమాద వివరాలు తెలిసిన వెంటనే తన మనస్సు తీవ్ర భారం పొందిందని, 17 మంది ప్రాణాలు పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మరింత బాధకరం ఏంటంటే, మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు.

తాము పోటీల నిమిత్తం భారత్‌కి వచ్చినప్పుడు పాతబస్తీ ప్రజలు ఎంతో ఆదరంగా స్వాగతించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారు ఇలాంటి విషాదాన్ని ఎదుర్కొవడం తన మనస్సు పగిలిపోయిందని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల కష్టాన్ని మాటల్లో వివరించడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

ఎమ్మా మారిసన్ ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో కెనడా తరఫున పోటీ పడుతున్నారు. తన పోటీ ప్రయాణం మధ్యలో ఇలా ఓ అర్థరాత్రి భయానక సంఘటన ఎదురవడం తాలూకు బాధను ఆమె వ్యక్తం చేశారు.