స్నేహం, ప్రేమ పేరిట మోసాలకు పాల్పడటం చూసాం.. కానీ పెళ్ళిపేరిట అమ్మాయిలతో హనీ ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతుందో ముఠా. ఇలా ఈ ముఠాలోని ఓ 23 ఏళ్ల యువతి 25 పెళ్లిళ్లు చేసుకుంది. ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఆమె వయసు కంటే మొగుళ్లే ఎక్కువ. 23 ఏళ్లకే 25 మందిని పెళ్లాడింది.. అదికూడా కేవలం ఏడు నెలల్లోనే. ఇలా ఇంతమందిని పెళ్లాడిన ఆ యువతి ఎవరు? ఎందుకోసం ఇలా ఒకరి తర్వాత ఒకరిని పెళ్లాడుతూ మొగుళ్లను మార్చిందో తెలుసుకుందాం.
రాజస్థాన్ కు చెందిన 23 ఏళ్ల యువతి అనురాధ పాశ్వాన్ ఓ దొపిడీ దొంగల ముఠాలో సభ్యురాలు. హనీ ట్రాప్ చేయడం… బెదిరించి డబ్బులు వసూలు చేయడం లేదంటే పెళ్లిచేసుకుని ఆ ఇంటిని లూటీ చేయడమే ఈ ముఠా పని. ఈ ముఠాలో అనురాధ కీలకంగా వ్యవహరించేది. డబ్బున్న మగాళ్లను తన అందచందాలతో ట్రాప్ చేయడం ఈమె పని.
మొదట ప్రేమ పేరిట వలవేసి ఆ తర్వాత ఫోటోలు, వీడియోలతో బెదిరించడం ఓప్లాన్. ఇది సక్సెెస్ కాకుంటే మరింత నమ్మించి పెళ్ళి చేసుకోవడం ఇలా ఇంట్లోకి చేరి డబ్బులు, నగలు, విలువైన వస్తువులను దొంగిలించుకుని పారిపోవడం ప్లాన్ బి. ఇలా ఇప్పటివరకు ఏకంగా 25 మందిని పెళ్లాడింది అనురాధ… అంటే ఆమె వయసు కంటే పెళ్లాడిన మగాళ్లే అధికం.
మగాళ్లను వలలో వేసుకోవడం నుండి పెళ్లికి ఒప్పించేవరకు అనురాధ చాలా తెలివిగా వ్యవహరించేది… ఎక్కడా అనుమానం రాకుండా చూసుకునేది. ఆమె నటన చూసి నిజంగా ప్రేమగా భావించి కొందరు మగాళ్లు చట్టబద్దంగా పెళ్లాడారు. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం ఇంట్లో ఉండి విలువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. అనంతరం అదును చూసుకుని తన ముఠాకు సమాచారం అందించి దోపిడీకి పాల్పడుతుంది. ఈ ఇళ్లు మొత్తాన్ని ఊడ్చేసి ముఠా సభ్యులతో కలిసే పారిపోతుంది.
ఇలా సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మంచి సంబంధం చూపిస్తామని చెప్పి సునీత, పప్పు మీనా అనే ఇద్దరు దళారులకు రూ.2 లక్షలు ఇచ్చానని ఆయన చెప్పారు. వీరు అనురాధతో తనకు ఏప్రిల్ 20 న పెళ్లిచేసారు. కొన్నాళ్లు విష్ణు శర్మతో కలిసున్న అనురాధ 12 రోజుల తర్వాత అంటే మే 2న ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయింది.
ఇంట్లోని వస్తువులతో పరారైన భార్య అనురాధపై విష్ణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో అనురాధ మోసాలు బైటపడ్డాయి. సోమవారం సవాయి మాధోపూర్ పోలీసులు భోపాల్లో ఆమెను పట్టుకున్నారు. ఆమెను విచారించగా ఇలా మగాళ్లను పెళ్ళిళ్ల పేరిట మోసం చేయడమే ఆమె పనిగా తెలిసింది. కేవలం ఒక్క విష్ణు శర్మనే కాదు ఇప్పటివరకు 25 మందిని ఇలాగే ఆమె మోసం చేసిందని పోలీసుల విచారణలో తేలింది.
ఎవరీ అనురాధ పాశ్వాన్ :
ఈ కిలేడీ అనురాధ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ కు చెందినదని… ఓ ఆసుపత్రిలో పనిచేసేదని పోలీసులు కనుగొన్నారు. భర్తతో గొడవ తర్వాత ఆమె భోపాల్కు వెళ్లింది. అక్కడ వాట్సాప్ ద్వారా వధువుల ఫోటోలు చూపించి నకిలీ వివాహ మోసాలను నడిపించే ముఠాలో చేరింది. వారు ఇలా ముందు పెళ్లిపేరిట రూ.2-5 లక్షలు వసూలు చేసేవారు… ఆ తర్వాత ఆ అమ్మాయిలతో కలిసి మోసాలకు పాల్పడేవారు.
విష్ణు శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత అనురాధ భోపాల్లో గబ్బర్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతని నుండి కూడా రూ.2 లక్షలు తీసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని ఇతరులను కూడా పోలీసులు గుర్తించారు. రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ లు అనురాధ ముఠాలోని సభ్యులు… అందరూ భోపాల్కు చెందినవారు
పోలీసులు కూడా వధువు కావాలంటూ నాటకం ఆడి ఓ కానిస్టేబుల్ను పంపించారు. అతడిని పెళ్లాడేందుకు అనురాధ సిద్దంకాగా పోలీసులు ఆమెను చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుుకున్నారు. ఆమె ఫోటోను ఏజెంట్ షేర్ చేయగానే పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.