Asianet News TeluguAsianet News Telugu

ఎన్ఎంసి బిల్లు వివాదం: అసలెందుకీ వ్యతిరేకత?

ఎన్ఎంసి బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు గళం విప్పుతున్నారు. జూనియర్ డాక్టర్లు వీధులకెక్కి పోరు సలుపుతున్నారు. అసలు వైద్యులు ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు, ఆ  బిల్లు చట్టమై అమలులోకి వస్తే ఏమవుతుంది?

Why doctors opposing NMC bill: reasons explained
Author
Hyderabad, First Published Aug 9, 2019, 12:07 PM IST

హైదరాబాద్: ఎన్ఎంసి బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు గళం విప్పుతున్నారు. జూనియర్ డాక్టర్లు వీధులకెక్కి పోరు సలుపుతున్నారు. అసలు వైద్యులు ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు, ఆ  బిల్లు చట్టమై అమలులోకి వస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఎందుకు ఆ బిల్లును తెస్తోంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. ఆ సమాధానాలు వెతికే క్రమంలోనే కొంత మంది వైద్యుల అభిప్రాయాలను కూడా సేకరించి ఇక్కడ పొందు పరుస్తున్నాం.

ఎన్ఎంసి బిల్లు అంటే నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) నిబంధనల ప్రకారం దేశంలో ప్రజలకు అవసరమైన వైద్యుల సంఖ్య దేశంలో లేదు. ప్రతి వేయి మందికి ఒక వైద్యుడు ఉండాలి. అలా చూసినప్పుడు దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. 2016 జూన్ 30వ తేదీ రికార్డుల ప్రకారం 9,88,922 మంది అలోపతి వైద్యులు ఉన్నారు. ఏటా 67,532 ఎంబిబీఎస్ పట్టా పుచ్చుకుంటున్నారు. గత రెండేళ్లలో 1,35,064 మంది ఎంబిబీఎస్ వైద్యులు వచ్చారు. దీంతో దేశంలో 11,23,986 మంది అలోపతి వైద్యులు అందుబాటులో ఉన్నారు. భారత జనాభా 120,00,00,000 ఉంది. తద్వారా ప్రతి 1067 మందికి ఒక్క వైద్యుడు ఉన్నాడు. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిష్పత్తికి ఇది చాలా దగ్గరగా ఉందని ఐఎంఎ తెలంగాణ రాష్ట్రం ఎస్ డబ్ల్యుసి సభ్యుడు డాక్టర్ కే. మురళీధర్ చెబుతున్నారు. 

దానికితోడు, దేశంలో క్వాలిఫైడ్ ఆయుష్ వైద్యులు 7,70,00 మంది ఉన్నారని, వారు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారని, అందువల్ల అనర్హులైన ప్రాక్టిషనర్ల అవసరం దేశంలో లేదని ఆయన వాదిస్తున్నారు. ఈ లెక్కల ద్వారా ప్రభుత్వానికి తమ సమస్యను వివరించే ప్రయత్నం చేయాలని ఆయన వైద్యులను కోరుతున్నారు. 

డాక్టర్ కాసుల లింగారెడ్డి వాదన ఇదీ...

ఎన్ఎంసి బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు నిరాహారదీక్షలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లదండ్రులకు తప్ప ఈ విషయం ఎవరికీ సమస్య ఏమిటో, ఎన్ఎంసి బిల్లు ఏమిటో తెలియదు. 

ఈ బిల్లు దేని గురించి అంటే?

1. మనదేశంలో 1950 నుండి "ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్" ఉండేది. దీని ప్రకారం దేశంలో ఉన్న వైద్య కళాశాలు నడిచాయి. కానీ ఇపుడు దాన్ని తొలగిస్తూ "నేషనల్ మెడికల్ కమిషన్"(NMC)అనే బిల్లును ప్రవేశపెట్టారు. పెరుగుతున్న జనాభాతో పాటు డాక్టర్స్ కూడా పెరగాలి, అపుడే కదా అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందుకే ఈ బిల్లును తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాళ్ళు డాక్టర్లను ఎలా పెంచుతున్నారంటే, 6 సంవత్సరాలు చదివే ఎంబీబీఎస్ కి బదులు   కాంపౌండర్లకు, లాబ్ టెక్నీషియన్స్ లకు , ఆర్ఎంపిలకు , పీఎంపీలకు 6 నెలల బ్రిడ్జి కోర్స్ ఇస్తారన్నమాట. ఈ 6 నెలల కోర్స్ తో  డాక్టర్ లైసెన్స్ వారికి లభిస్తుంది. దీని వల్ల 6 సంవత్సరాలు చదివిన వైద్యులకు అన్యాయం జరగడమే కాకుండా 6 నెలల నకిలీ వైద్యం పెరిగిపోతుంది. దీని వల్ల ఏ రాజకీయ నాయకుడు కూడా నష్టపోడు, మన జనమే నష్టపోయేది. ఈ నకిలీ వైద్యం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్లను పెంచాలంటే వైద్య సీట్లను పెంచాలి కానీ నకిలీ వైద్యాన్ని ఎలా ప్రవేశపెడుతారనేది మా ఆవేదన

2. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ముందు 85 శాతం సీట్లు గవర్నమెంట్ కింద ఉండేవి.. కానీ ఇప్పుడు ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం దీనిని 50 శాతానికి కుదించారు. దీని వల్ల మెరిట్ తో రాంక్ లు సాధించిన విద్యార్థులకు నష్టపోతారు. దీని వల్ల ఫ్రీ సీట్లు తగ్గిపోతాయి.పేద విద్యార్థి ఎప్పటికీ డాక్టర్ కాలేడు. ఈ 50 శాతం సీట్లు 2 నుండి 5 కోట్ల వరకు ధర పలుకుతాయి.

3. తర్వాతి ఎగ్జాం వల్ల వైద్య విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. ఈ  పరీక్షలో చాలా తిరకాసులు ఉన్నాయి. దీని వల్ల మెరిట్  విద్యార్థోులకు అన్యాయం జరుగుతుంది. నకిలీ డాక్టర్లు లకు లైసెన్స్ ఇచ్చి ప్రజల ఆరోగ్యంపై ఆటలాడుకుంటారు.

డాక్టర్ చంద్రశేఖర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మహబూబాబాద్ వాదన ఇదీ...

వైద్య విద్యను చదవని డాక్టర్లకు ఆరోగ్యాన్ని అప్పగిస్తారు. పిల్లలు ఎంబిబిఎస్ చదివే అవకాశాన్ని కోల్పోతారు. ఆరేళ్లు రేయింబవళ్లు కష్టపడి ఎంబిబిఎస్ చదివిన చివరి ఏడాది పరీక్ష తర్వాత మళ్లీ ఎక్దిట్ పరీక్ష పాసు కావాల్సి ఉంటుంది. ఆ పరీక్ష పాసయితేనే ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇది అన్యాయం.

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ కోటాపై కోత విధించి 80 శాతం సీట్లను అమ్ముకోవడానికి వీలు కల్పిస్తున్నారు. బిల్లులోని సెక్షన్ 32 ప్రకారం ఆరు నెలలు శిక్షణ పొందిన ఆరోగ్య సేవా కార్యకర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుంది. ఇది ప్రజలకు ఏమంత క్షేమకరం కాదు.

సంబంధిత వార్తలు

డాక్టర్లను కాళ్లతో తంతారా...? పవన్ ఆగ్రహం

జూనియర్ డాక్టర్‌ను కొట్టిన డీసీపీ: చర్యలకు జూడాల డిమాండ్

ఆస్పత్రి పెట్టి, నర్సు మహిళను చంపేసింది: జీవిత (వీడియో)

అలా చేస్తే ప్రజలే కాదు, నేతలూ చస్తారు: హీరో రాజశేఖర్ (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios