మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఇటీవల ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి.
దీనిపై ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఇద్దరి పేర్లను అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ప్రచారంలో తిరుపతి, వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ విషయానికొస్తే మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్. ఆయుధ విభాగానికి చెందిన నేత.
మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను సైద్ధాంతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి. మావోయిస్టు పూర్వ నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. తిరుపతి దళిత వర్గానికి చెందినవారు కాగా, వేణుగోపాల్ అగ్రకులానికి చెందినవారు. ఈ నేపథ్యంలో తిరుపతిని నేతగా ఎంపిక చేస్తే, ఆదివాసీ, దళిత సామాజిక వర్గాల్లో మద్దతు పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే వయోపరంగా చూస్తే.. తిరుపతికి 62 ఏళ్లు కాగా.. వేణుగోపాల్కు 70 ఏళ్లు.
మావోయిస్టుల తాజా దళాలు ఆయుధ పోరాటం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో తిరుపతి ఎంపికకు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పార్టీ సీనియర్లు మాత్రం వేణుగోపాల్కు మద్దతుగా ఉన్నట్లు సమాచారం.
మావోయిస్టులను నిర్మూలించే దిశగా అడుగులు:
బస్వరాజ్ మరణంతో మావోయిస్టులకు తీవ్ర ఎదురుదెబ్బ తగలగా.. కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' ద్వారా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే దిశగా దూసుకుపోతుంది. 2024 జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
* మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంగా కేంద్రం ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంప్ను ఏర్పాటు చేసింది.
* టెక్నాలజీ ఆధారంగా సమాచారం సేకరణ – డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం.
* శాంతి స్థాపన కోసం పోలీస్ స్టేషన్లు – మావోయిస్టుల కట్టడిలోకి వచ్చిన ప్రాంతాల్లో వెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
* ఆయుధాలు వదిలేసి లొంగిపోయే వారికి అవకాశాలు కల్పిస్తున్నారు.