ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 

మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచిపోయారు. కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన పురోగతి కనబడలేదు. సంక్షేమం పూర్తిగా కుంటుప‌డింది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రజల ఖర్చు సామర్థ్యం తగ్గింది. ఖజానాకు రావాల్సిన ఆదాయం త‌గ్గిపోయింది. ప్రజల సొమ్ము కొంతమంది కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతోందని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

భారీగా పెరిగిన అప్పులు

రాష్ట్ర రెవెన్యూలో దేశస్థాయిలో 13.76% పెరుగుదల ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం 3.8% మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఏడాదిలో ₹1,37,546 కోట్ల అప్పు చేసింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. గతంలో త‌మ హయాంలో చేసిన అప్పు రూ. 3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు పాలన ఏడాదిలోనే దానికి సగానికి పైగా అప్పులు చేవార‌న్నారు. రిజర్వ్ బ్యాంక్, ఫైనాన్స్ అకౌంటబిలిటీ నిబంధనలు ఉల్లంఘిస్తూ అప్పుల ప్రక్రియ కొనసాగుతుందని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

విద్యుత్ కొనుగోలులో అక్రమాలు

విద్యుత్ కొనుగోలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఒప్పందాలు చేసిందని జ‌గ‌న్ అన్నారు. పీక్ అవర్ సమయంలో రూ. 4.60 ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందని, ఇదే సమయంలో వైసీపీ హయంలో అదే విద్యుత్ రూ. 2.49కే కొనుగోలు చేశారని జ‌గ‌న్ గుర్తు చేశారు. ఎక్కువ ధ‌ర‌కు విద్యుత్‌ను కొనుగోలు చేయ‌డంలో పెద్ద స్కామ్ ఉంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

భూముల కేటాయింపుల్లో అక్రమాలు

ఇక ఉర్సా అనే ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బిడ్ లేకుండా కేటాయించార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టారన్నారు. ఇది పారదర్శకతకు వ్యతిరేకంగా ఉందని, ప్రజా ఆస్తులను కొంతమంది ప్రైవేట్ లాభదారులకు అప్పగించడం ప్ర‌జా ధ‌నాన్ని దోచిపెట్ట‌డం అని అన్నారు.