WAVES 2025: వరల్డ్‌ ఆడియో విజువల్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (WAVES 2025) లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్ ఈ అభిప్రాయానికి ప్రస్తుత యుగం పూర్తిగా సిద్ధమైందని  ప్రపంచం కథలు చెప్పే కొత్త మార్గాలను అన్వేషిస్తున్న వేళ, భారతదేశం వద్ద చెప్పలేని అనేక కథలున్నాయన్నారు.   

WAVES 2025: భారతదేశాన్ని గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (WAVES 2025) ముంబయిలో ఘనంగా ప్రారంభమైంది. మే 1 నుంచి 4 వరకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. 

భారతీయ సంస్కృతిలో ప్రతి ఊరి కథే ఒక సినిమాకు మూలం:  ప్ర‌ధాని మోడీ 

ప్రధాని నరేంద్ర మోడీ వరల్డ్‌ ఆడియో విజువల్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (WAVES 2025)  సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ, "భారతీయ సంస్కృతిలో ప్రతి ఊరి కథే ఒక సినిమాకు మూలం. ప్రతి నది ఒక గేయం. ప్రతి పర్వతం ఒక కవిత. వేవ్స్‌ అనేది సాంస్కృతిక, సృజనాత్మక విలువలకు ప్రతీక" అని అన్నారు. ఆరెంజ్ ఎకానమీకి ఇది నాంది అని తెలిపారు. 

"క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్" ఈ అభిప్రాయానికి ప్రస్తుత యుగం పూర్తిగా సిద్ధమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచం కథలు చెప్పే కొత్త మార్గాలను అన్వేషిస్తున్న వేళ, భారతదేశం వద్ద చెప్పలేని అనేక కథలున్నాయన్నారు. దేశంలోని ప్ర‌తిగ‌ల్లీలో చెప్పుకోద‌గ్గ క‌థ‌లు ఉన్నాయ‌ని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా, మానవ విలువల సంరక్షణ అవసరమని నొక్కి చెప్పారు. మానవులను రోబోలుగా మార్చకూడదు... మానవ సున్నితత్వాన్ని మరింత పెంపొందించాలంటూ మోడీ కీ కామెంట్స్ చేశారు. డిజిటల్ యుగంలో కూడా మానవ స్పర్శ అవసరమని అన్నారు. 

ఆన్‌లైన్ కంటెంట్, యువత భద్రతపై మోడీ హెచ్చరిక

తీవ్రవాద భావజాలం పెరుగుతున్న నేపథ్యంలో, యువతను హానికరమైన కంటెంట్‌ నుంచి రక్షించాల్సిన అవసరాన్ని ప్ర‌ధాని మోడీ హైలైట్ చేశారు. మనం యువతరాన్ని మానవ వ్యతిరేక ఆలోచనల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు. కంటెంట్ సృష్టికర్తలు బాధ్యతాయుతమైన కథనాలను రూపొందించాలని కోరారు.

అలాగే, భారతదేశం బిలియన్ల కథల భూమి. మన ‘ఖానా’ (ఆహారం) గ్లోబల్ ఐతే, ‘గానా’ (సంగీతం) కూడా త్వరలో ప్రపంచ హృదయాలను తాకుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్క్రీన్ పరిమాణం తగ్గినా, భారతీయ కథల ప్రభావం విస్తృతంగా పెరుగుతోందనీ, పరిమాణం చిన్నదైనా పరిధి అనంతమ‌ని పేర్కొన్నారు. 

సినిమా, సంగీతం, గేమింగ్, ఫ్యాషన్‌ వంటి రంగాల్లో సృజనాత్మకత, సహకారం, ఆవిష్కరణలకు వేదికగా WAVES నిలుస్తుందన్నారు. ఇది కేవలం సమ్మిట్ కాదనీ, భారతీయ సాంస్కృతిక బలాన్ని ప్రపంచం ముందు ప్రతిబింబించే సృజనాత్మక తరంగం అని మోడీ పేర్కొన్నారు. 

డిజిటల్ కంటెంట్, గేమింగ్, సినిమాలు, సంగీతం, లైవ్ ప్రదర్శనలు వంటి రంగాల్లో భారతదేశం అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతున్నట్లు ఈ సదస్సు స్పష్టం చేసిందనీ, ప్రపంచ సృష్టికర్తలు, పరిశ్రమల నాయకులు, స్టార్టప్‌లు, పాలసీ మేకర్లను ఒకే వేదికపైకి తేచి, భవిష్యత్ వినోద రంగానికి మార్గం చూపిస్తోంద‌న్నారు. 

WAVES 2025 స‌మ్మిట్ లో 90కి పైగా దేశాల ప్ర‌తినిధులు 

WAVES 2025 సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా ప్రతినిధులు, 1000 మందికి పైగా కంటెంట్ క్రియేటర్లు, 300 కంపెనీలు, 350 స్టార్టప్‌లు పాల్గొంటున్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, రాజమౌళి వంటి సినీ ప్రముఖులతో పాటు ముఖేశ్ అంబానీ, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్ర వంటి కార్పొరేట్ దిగ్గజులు ఈ సదస్సులో హాజరయ్యారు.

సినిమా, ఓటీటీ, యానిమేషన్‌, కామిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌, డిజిటల్ మీడియా వంటి విభాగాల్లో ప్రగతిపై చర్చలు, భాగస్వామ్యాలు జరుగుతున్నాయి. కంటెంట్ క్రియేట‌ర్ల కోసం మోడీ 'వేవ్స్ అవార్డ్స్' అనే ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రారంభించనున్నట్టు ఈ సంద‌ర్భంగా ప్రకటించారు.