కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు సిద్దమయ్యింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇవాాళ భేటీ అయిన సూపర్ కేబినెట్. ఆ నిర్ణయాలేంటో తెలుసుకుందాం.  

కేంద్ర ప్రభుత్వం కీలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన సూపర్ కేబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. చాలాకాలంగా కులగణన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కేంద్ర భావిస్తోంది... ఇందుకోసమే సూపర్ కేబినెట్ లో దీనిపై చర్చించారు. జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా కులగణనకు సీసీపీఏ ఆమోదం తెలిపింది. 

కులగణనకు కాంగ్రెస్ వ్యతిరేకం :   మంత్రి అశ్వినీ వైష్ణవ్ 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనను వ్యతిరేకించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన జనాభా లెక్కల్లో కులం అంశాన్ని చేర్చలేదన్నారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్‌సభలో కుల గణనపై కేబినెట్‌లో చర్చిస్తామని హామీ ఇచ్చారని... దీనిపై చర్చించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేసారు. చాలా రాజకీయ పార్టీలు కుల గణనకు మద్దతు తెలిపాయి... అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేయకుండా కేవలం ఒక సర్వేను నిర్వహించిందని మంత్రి పేర్కోన్నారు. దాన్ని SECC (Socio Economic and Caste Census) గా పిలుస్తారు.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు INDI కూటమి భాగస్వాములు కుల గణనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.  కొన్ని రాష్ట్రాలు కులాలపై సర్వేలు చేశాయి. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించగా, మరికొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోణంలో పారదర్శకత లేకుండా గణన నిర్వహించాయి. దీని వల్ల సమాజంలో అనేక సందేహాలు ఏర్పడ్డాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. 

రాజకీయాలు సామాజిక ఐక్యతను భంగం పరచకుండా ఉండాలంటే కుల గణనను సర్వేల రూపంలో కాకుండా అధికారిక జనగణనలో పారదర్శకంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానంతో దేశం అభివృద్ధి పథంలో సాగుతూ సామాజిక, ఆర్థిక నిర్మాణం మరింత బలోపేతం అవుతుంది. కులగణన నిర్ణయం సమాజం, దేశ ప్రయోజనాల పట్ల మోదీ ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 

గతంలో కూడా సామాజిక సమతుల్యతను భంగం చేయకుండా, ఆర్థికంగా బలహీన వర్గాల కోసం 10% రిజర్వేషన్ తీసుకురావడం ఈ ప్రభుత్వ గొప్ప ఉదాహరణగా మంత్రి పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం జనగణన అనేది కేంద్ర అంశం... ఇది ఏడు షెడ్యూల్‌లోని యూనియన్ లిస్ట్‌లో 69వ అంశంగా ఉంటుందని అశ్విని వైష్ణవ్ వివరించారు.

Scroll to load tweet…

 

చెరకు పంటకు మద్దతుధర : 

కులగణనతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. సిల్చార్‌-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో ఈ కారిడార్ నిర్మాణం  చేపట్టనున్నారు. అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణం చేపట్టనున్నారు.