విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని మోడీ ప్రారంభించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలిసి ఆయన పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.    

Vizhinjam Port Inauguration : విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేశారు. ఈ ఓడరేవు వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మలయాళంలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను, అవకాశాలను వివరించారు. ఇకపై దేశం సుసంపన్నంగా ఉంటుందనన్నారు. ఈ నౌకాశ్రయం కేరళకే కాదు దేశానికీ కొత్త ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని మోడీ అన్నారు.

దేశంలోని ఓడరేవు నగరాలు అభివృద్ధి చెందిన భారత్ కలకు కేంద్ర బిందువులని ప్రధాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం విజింజం ఓడరేవు అభివృద్ధిని సాకారం చేసామన్నారు. ఈ కార్యక్రమం ఇండియా కూటమిలో చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. విజింజం ఓడరేవును చూశానని.. ఇంత పెద్ద ఓడరేవును గౌతమ్ అదానీ కేరళలో నిర్మించడం వల్ల గుజరాతీయులు ఆయనను కోప్పడతారని మోడీ సరదాగా కామెంట్ చేసారు. 

గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జోర్జ్ కురియన్, మంత్రి వి.ఎన్. వాసవన్, ఎంపీలు శశి థరూర్, జాన్ బ్రిట్టాస్, ఎమ్మెల్యే ఎం. విన్సెంట్, మేయర్ ఆర్య రాజేంద్రన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to load tweet…

 

గురువారం సాయంత్రమే కేరళకు చేరుకున్న ప్రధాని మోదీ ఇవాళ(శుక్రవారం) ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఓడరేవుకు చేరుకున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత వేదికపైకి వచ్చారు. అక్కడ ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి, ప్రజలకు అభివాదం చేశారు. సభలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. అనంతరం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రధానికి పూలదండ వేశారు.

విజింజం ప్రాజెక్టుకు కేంద్రం వీజీఎఫ్ నిధుల రూపంలో అప్పు ఇచ్చిందే తప్ప ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రధాని మోడీ సమక్షంలోనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. తన ప్రసంగంలో ఎక్కడా మాజీ ముఖ్యమంత్రి ఉమ్మన్ చాందీ గురించి ప్రస్తావించలేదు.

 

Scroll to load tweet…